జగన్ పాదయాత్ర పై పెదవి విరిచిన ఏపీ కాంగ్రెస్..! సెల్ఫీలు, ముద్దులు తప్ప ఏమీ లేదన్న రఘువీరా..
విజయవాడ/ హైదరాబాద్ : వైసీపి అదినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సుధీర్గ కాలం తర్వాత నేడు ముగింపు దశకు చేరుకుంది. ఇడుపుల పాయలో గతేడాది మొదలైన పాదయాత్ర సుమారు 14నెలలు నిరాటంకంగా కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చేరుకున్న పాదయాత్రకు ముగింపు పలికేందుకు పార్టీ నాయకత్వం సన్నాహలు చేస్తోంది. అందుకోసం భారీ పైలాన్ ను ఆవిష్కరించడమే కాకుండా పెద్దయెత్తున బహిరంగ సభ నిర్వహించేందుకు వైసీపి శ్రేణులు రెడీ అయ్యారు. ఇంత వరకూ కధ బాగానే ఉన్నప్పటికి జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురించి వివిద పార్టీలు తమ తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగన్ పాదయాత్ర గురించి విమర్శలు గుప్పిస్తోంది.
జగన్ పాదయాత్రపై వైసీపీ గొప్పలు చెబుతోందని ఏపి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన జగన్ సాదించిందేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని చూడటానికే జనం ఎగబడ్డారు తప్ప, ప్రజల మనసుల్లోంచి వచ్చింది కాదని కొట్టి పారేసారు.
అంతే కాకుండా జగన్ పాదయాత్రలో ఏముంది, రోజుకు 2 కోట్ల ఖర్చు అని తీవ్రంగా విమర్శించారు. మరో అడుగు ముందుకేసి జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, నెత్తి మీద ముద్దులు తప్ప ఏమీలేదని చమత్కరించారు. అంతే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్రంట్ పై రఘువీరా స్పందించారు. చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ ఒక మిథ్య అని అన్నారు. టీడీపీతో పొత్తుపై త్వరగా తేల్చాలని అధిష్ఠానాన్ని కోరామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.