కాంగ్రెస్ నేతలకు జనసేన గాలం, వైసీపీ వైపు వారి చూపు: 'పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడే కదా!'
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశం తేలిపోయింది. తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. 175 అసెంబ్లీ, 25 లోకసభ నియోజకవర్గాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో కొన్ని సీట్లు అయినా గెలుచుకుంటామని భావించామని, ఇప్పుడ ఒంటరి పోరు అంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని చాలామంది ఆందోళనతో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్లు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
బాబు 'సాఫ్ట్', 'హార్డ్' అస్త్రాలు:పవన్ కళ్యాణ్కు అక్కడ ఎలా చెక్ చెప్పాలి!? వైసీపీలో క్రెడిట్ గుబులు
టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి?
ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. తాజాగా, గురువారం తన అభిమానులు, అనుచరులతో భేటీ అయ్యారు. పార్టీ మారే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరాలని అభిమానులు సూచించారని తెలుస్తోంది. రేపు మరోసారి కర్నూలులో అభిమానులతో భేటీ అయి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారని కూడా తెలుస్తోంది.
వైసీపీ వైపు కిల్లి కృపారాణి చూపు, జనసేన గాలం
కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరికొందరు నేతలకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన గాలం వేస్తోందని ప్రచారం సాగుతోంది.
పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడే కదా..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో కలిసి వెళ్లలేని పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదా జనసేనతో వెళ్లేందుకైనా సిద్ధపడాలని అభిప్రాయపడ్డారు. తమతో పొత్తుకు జగన్ సిద్ధమని చెబితే వైసీపీతో కాంగ్రెస్ సిద్ధపడాలన్నారు. జగన్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధమంటే జనసేనతో కూడా కలిసేందుకు సై అన్నారు. ఎందుకంటే ఆయన తమ పార్టీ నేత చిరంజీవి తమ్ముడే అన్నారు. ఇది తన వ్యక్తిగత ఆలోచన అని, వీటిపై కేంద్ర అధిష్టానంతో చర్చిస్తామన్నారు.