నగదు కొరతకు నిరసనగా...ఈ నెల 21 న బ్యాంకుల దగ్గర కాంగ్రెస్ ధర్నా
విజయవాడ: రాష్ట్రంలో నగదు కొరతకు నిరసనగా ఈనెల 21న అన్ని బ్యాంకులు, ఏటీఎంల దగ్గర కాంగ్రెస్ ధర్నా,ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో నగదు కొరత ఇంత తీవ్రంగా ఉంటే,ఎటిఎంల్లో డబ్బులు రాక అల్లాడుతుంటే ప్రజల ఇబ్బందులు సిఎం చంద్రబాబుకు కనిసించడం లేదా అని ప్రశ్నించారు.
నోట్ల రద్దు సమస్యల పరిష్కార కమిటీ చైర్మన్గా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో నగదు కొరతపై వెంటనే స్పందించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఈ నెల 21 న కాంగ్రెస్ చేయబోయే ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు,అభిమానులకు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
ఇదిలావుండగా దేశంలో నగదు కొరత ఉన్న రాష్ట్రాలకు కరెన్సీనోట్లను విమానాల్లో పంపిస్తామని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజరు జే స్వామినాథన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నగదు కొరత తీవ్రంగా ఉన్నఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అదనంగా కరెన్సీనోట్లను పంపించాలని రిజర్వుబ్యాంకు నిర్ణయించిందని సీజీఎం పేర్కొన్నారు.