ఏపీ కరోనా అప్డేట్- భారీగా తగ్గిన కొత్త కేసులు- కృష్ణా, విశాఖలో దాదాపు అదుపులోకి..
ఏపీలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గుతోంది. రెండు వారాల క్రితం పదిన్నర వేలకు తక్కువ కాకుండా నమోదైన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 6200కు తగ్గిపోయింది. అంటే రెండు వారాల్లోనే రోజువారీ కేసుల సంఖ్య నాలుగు వేల కంటే తక్కువకు తగ్గిపోవడం విశేషం. మృతుల సంఖ్య కూడా తగ్గినా నిలకడ మాత్రం కొనసాగుతోంది.
ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6235 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1262 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో కేవలం 133 కేసులు మాత్రమే వచ్చాయి.. నెల రోజులుగా ఈ రెండు జిల్లాలు అత్యధిక, అత్యల్ప కేసుల రికార్డుల్లో కొనసాగుతున్నాయి. కృష్ణాతో పాటు రెండో అత్యల్ప కేసులు వచ్చిన జిల్లాగా 150 కేసులతో విశాశపట్నం రికార్డు సాధించింది. తూర్పుగోదావరి తర్వాత పశ్చిమగోదావరి (962), ప్రకాశం (841) మాత్రమే 500 కంటే ఎక్కువ కేసులు నమోదైన జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6.31 లక్షలు కాగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5.51 లక్షలుగా ఉంది. ప్రస్తుతం 74500 యాక్టివ్ కేసులున్నాయి.
మృతుల సంఖ్యలోనూ క్రమంగా తగ్గుదల కనిపిస్తున్నా మొత్తం మీద చూస్తే సంఖ్య మాత్రం దాదాపు నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 51 మంది కరోనాతో చనిపోయారు. అత్యధికంగా, ఆశ్చర్యకరంగా అతి తక్కువ కేసులు నమోదైన కృష్ణా జిల్లాలో 9 మంది కరోనాతో చనిపోయారు. విశాఖలో ఆరుగురు, అనంతపూర్లో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో నలుగురేసి, కర్నూల్లో ముగ్గురు, కడప, ప్రకాశంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు చనిపోయారు. వీటితో కలిపి రాష్ట్ర్ంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5410కి చేరుకుంది.