ఏపీ కరోనా అప్డేట్- వెయ్యి కేసులు- ఎనిమిది మరణాలు- ఎక్కడెక్కడంటే...
ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పలు జిల్లాల్లో గతంలో నమోదైన కేసులతో పోలిస్తే తక్కువ రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంట్లలో కేవలం 1085 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటితో పాటు 8 మరణాలు కూడ నమోదయ్యాయి. మరోవైపు 1447 మంది తాజాగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులను గమనిస్తే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 224 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లో చిత్తూరు 142, పశ్చిమగోదావరి 138, గుంటూరు 126, తూర్పుగోదావరి 116 కేసులు వచ్చాయి. అత్యల్ప కేసులు నమోదైన జిల్లాల్లో అనంతపురం 10, శ్రీకాకుళం 26, కర్నూలు 31, విజయనగరం 37, ప్రకాశం 42, నెల్లూరు 50, కడప 57 ఉన్నాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.63 లక్షలకు చేరుకోగా.. ఇందులో 8.43 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం మరో 13024 మంది చికిత్స పొందుతున్నారు.
మృతుల విషయానికొస్తే కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ నమోదైన మరణాల సంఖ్య 6956కు చేరింది. మరోవైపు ఇప్పటివరకూ రాష్ట్రంలో పరీక్షించిన కరోనా శాంపిల్స్ సంఖ్య 97 లక్షల 27 వేల 321కు చేరింది. పలు జిల్లాల్లో కరోనా పరిస్ధితులు అదుపులోకి వచ్చినట్లు ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పూర్తిగా వైరస్ నిర్మూలనకు సిద్ధమవుతోంది.