ఏపీ కరోనా అప్డేట్- 24 గంటల్లో 1160 కేసులు, ఏడు మృతులు- ఎక్కడెక్కడంటే..
ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. నెల రోజుల నుంచి క్రమం తప్పకుండా తగ్గుతూ వస్తున్న కేసుల ప్రభావం తాజా హెల్త్ బులిటెన్ పైనా కనిపించింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1160 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. 1765 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా బయటపడ్డారు.
గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులను పరిశీలిస్తే కృష్ణా జిల్లా అగ్రస్ధానంలో నిలిచింది. కృష్ణా జిల్లాలో 189 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్దానాల్లో తూర్పుగోదావరి 165, చిత్తూరు 148, గుంటూరు 121, పశ్చిమగోదావరి 120 కేసులు వచ్చాయి. మిగతా జిల్లాల్లో మాత్రం వందకు లోపే కేసులు నమోదయ్యాయి. అత్యల్ప కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు జిల్లా టాప్లో ుంది. కర్నూలు జిల్లాలో కేవలం 23 కేసులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత స్ధానాల్లో విజయనగరం 42, అనంతపురం 43, శ్రీకాకుళం 46, నెల్లూరు 60, ప్రకాశం 66 కేసులు నమోదయ్యాయి.
మృతుల విషయానికొస్తే కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు. అనంతపూర్, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6927కు చేరుకుంది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8.61 లక్షలకు చేరుకోగా.. వీరిలో 8.39 లక్షల మంది కోలుకున్నారు. మరో 14770 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టి వరకూ ఏపీలో పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 95.43 లక్షలకు చేరుకుంది.