ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. మూడు జిల్లాల్లో వెయ్యేసి కొత్త కేసులు..58 మంది మృతి..
ఏపీలో కరోనా విజృంభణ నిరంతరాయంగా కొనసాగుతోంది. భారీగా టెస్టులు నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య కూడా అంతే భారీగా నమోదవుతోంది. తాజాగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. ఇందులో దాదాపు సగం కేసులు యాక్టివ్ గానే ఉన్నాయి. మిగిలిన వారు మాత్రం చికిత్స తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.
ఏపీలో గత 24 గంటల్లో 9276 కొత్త కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్నూల్లో (1234), అనంతపురంలో (1128), గుంటూరు జిల్లాలో (1001) కేసులు తేలాయి. ఆ తర్వాత స్ధానాల్లో చిత్తూరు (949), తూర్పుగోదావరి (876), నెల్లూరు (559) ఉన్నాయి. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య లక్షా 50 వేల 209కి చేరింది. ఇందులో 72 వేలకు పైగా యాక్టివ్ కేసులుండగా.. మరో 76 వేల మందికి పైగా కోలుకున్నారు.
Recommended Video
మృతుల సంఖ్యను గమనిస్తే గత 24 గంటల్లోనే రాష్ట్రంలో 58 మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎనిమిదేసి మంది చనిపోయారు. గుంటూరులో ఏడుగురు, అనంతపూర్, చిత్తూరు, కర్నూల్లో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున చనిపోయారు. కడపలో ఒకరు మరణించారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ మరణాల సంఖ్య 1407కు చేరింది.