ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు- మరోసారి 10 వేల మార్క్- మరో 81 మృతులు..
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇవాళ నాలుగు లక్షలు దాటిపోయింది. వీరిలో 3 లక్షల మందికి పైగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కావడం ఊరట కలిగించే అంశం.
ఏపీలో గత 24 గంటల్లో 10 వేల 526 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలో మరోసారి వెయ్యి కేసుల మార్క్ దాటింది. తూర్పున 1178, నెల్లూరులో 1151 కేసులు తేలాయి. అలాగే పశ్చిమగోదావరి 986, విశాఖ 896, అనంతపురం 833, చిత్తూరు 819 కేసులతో కొత్త కేసుల జాబితా టాప్లో నిలిచాయి. అట్టడుగున ఉందని భావిస్తున్న కృష్ణాజిల్లాలో తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ రోజుకు 200 కంటే తక్కువగా నమోదైన కేసుల సంఖ్య రెండు వారాల్లో తొలిసారిగా 400 దాటింది.
Recommended Video
మృతుల విషయానికొస్తే చిత్తూరు జిల్లాలో 10 మంది, కడపలో తొమ్మిది మంది, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఎనిమిదేసి మంది, తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖలో ఆరుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పన చనిపోయారు. గుంటూరులో నలుగురు, విజయనగరంలో ఒక్కరు చనిపోయారు.