వైసీపీని నోరెత్తనీయొద్దు: ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ: అర్ధరాత్రి మంతనాలు: దిశా నిర్దేశం.. !
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు శాసనమండలిలో బ్రేక్ పడటంపై తెలుగుదేశం పార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. శాసనమండలి రూల్బుక్లోని 71వ నిబంధనను తెరపైకి తీసుకొచ్చిన తెలుగుదేశం సభ్యులు వికేంద్రీకరణ బిల్లు మండలి ఆమోదం పొందుకుండా అడ్డుకున్నారు. రూల్ 71 కింద వికేంద్రీకరణ బిల్లుపై చర్చ నిర్వహించాలనే అంశం మీద నిర్వహించిన ఓటింగ్లో టీడీపీ పైచేయి సాధించింది. బుధవారం ఈ బిల్లు మండలిలో చర్చకు రానున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు.
బీజేపీ నేతల యూటర్న్: ఆ విషయంలో జగన్కు మద్దతు: కేంద్రాన్ని ఒప్పించైనా..!
ఉండవల్లికి తరలిన ఎమ్మెల్సీలు..
మంగళవారం రాత్రి శాసన మండలి వాయిదా పడిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నివాసానికి తరలి వెళ్లారు. మాజీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వారంతా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీలు జై అమరావతి, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిలాలి అంటూ నినదించారు.
అధినేత ప్రశంస..
కీలకమైన రూల్ 71ను తెరమీదికి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపై చంద్రబాబు వారిని ప్రశంసించారు. సమయోచితంగా ప్రవర్తించారని అభినందించారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉండాలని సూచించారు. రాజీనామా చేసిన వారి గురించి పట్టించుకోవద్దని, పీడీఎఫ్ వంటి ఇతర తటస్థ, ప్రతిపక్ష ఎమ్మెల్సీల మద్దతును కూడగట్టుకోవాలని అన్నారు.
వైసీపీ సభ్యులను నోరెత్తనీయొద్దు..
ప్రస్తుతం శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్యాబలం నామమాత్రంగా ఉందనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రులు.. శాసన మండలి సమావేశాలకు హాజరవుతారని, సభలో గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారని హెచ్చరించారు. వారిని నోరెత్తనీయకుండా చేయాలని చంద్రబాబు.. తన ఎమ్మెల్సీలకు సూచించారు.
పీడీఎఫ్.. ఇతర ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడతా..
ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు ప్రతికూలంగా ఓటు వేసేలా తటస్థలు, టీడీపీయేతర సభ్యులతో తాను మాట్లాడతానని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) సభ్యులతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడు, బీజేపీ సభ్యులు తటస్థంగా నిలిచారని, తాను వారిని సంప్రదిస్తానని, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించేలా చేస్తానని చంద్రబాబు చెప్పారు. రూల్ 71 తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పోతుల సునీత, శివనాథరెడ్డిలపై తగిన చర్యలు ఉంటాయని అన్నారు. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా 71వ రూల్కు వ్యతిరేకంగా ఓటు వేశారని, అలాంటి వారి గురించి పట్టించుకోవద్దని అన్నారు.