అప్పుడు చిరంజీవికే భయపడలేదు...ఇప్పుడు పవన్ కు జడుస్తామా?: చినరాజప్ప
తిరుమల: బీజేపీ డైరక్షన్లోనే వైసీపీ, జనసేన పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని డిప్యూటీ సీఎం చినరాజప్ప పునరుద్ఘాటించారు. గతంలో చిరంజీవికే తాము భయపడలేదని, ఇప్పుడు పవన్ కల్యాణ్కు జడిసేది లేదని చినరాజప్ప అన్నారు.
2019 ఎన్నికల్లో తామే గెలుస్తామని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మనసులు గెలుచుకున్నారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చినరాజప్ప చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడలేదని చినరాజప్ప చెప్పారు.
మరోవైపు విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో పోటీ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాలు విసిరారు. విశాఖ ఐటీ హిల్స్ ప్రాంతంలోని ఓ కన్వెన్షన్ హాల్లో పవన్ అభిమానులు జనసేన పార్టీలో చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు. సినీ నటుడికి ఏమి తెలుసని తనను ఉద్దేశించి చాలా మంది విమర్శలు చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ విధానం మీదనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ సవాలు చేశారు. చంద్రబాబు, లోకేశ్, జగన్ తనతో చర్చించేందుకు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు మీద పడినా డబ్బు, అధికారంపై ఆశ తగ్గలేదని పవన్ ఎద్దేవా చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూమి కేటాయింపుపైనా పవన్ ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పవన్ పునరుద్ఘాటించారు.