ఏపీలో అవినీతిపై బాబు తేల్చిన లెక్క : అందరూ మహాత్ములే ఉండరన్న కేఈ
విజయవాడ : ఏపీలో భారీ స్థాయిలో అవినీతి పేరుకు పోయిందంటూ ఇటీవల 'నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్' సంస్థ వెల్లడించిన వివరాలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైనట్లుగానే కనిపిస్తోంది. విషయంపై ఆరా తీయించిన సీఎం చంద్రబాబు అవినీతికి సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఏపీలో అవినితికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ లెక్కలన్నీ సీఎం చంద్రబాబు తేల్చినవే అని డిప్యూటీ సీఎం కేఈ చెప్పడం గమనార్హం. ఇక ఆ అవినీతి లెక్కల విషయానికొస్తే.. ఏపీలోని రెవెన్యూ శాఖల్లో 42 శాతం అవినీతి చోటు చేసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు.
అయితే దీన్ని అవినీతి కోణంలో కాకుండా.. 58 శాతం మంది రెవెన్యూ అధికారులు నిజాయితీగా పనిచేస్తున్న తరహాలో చూడాలని సూచించారు. ఈ లెక్కలను పట్టుకుని రెవెన్యూ మొత్తం అవినీతిమయం అయిందనడం సరికాదని.. రెవెన్యూ శాఖలో అందరూ మహాత్మాగాంధీలే ఉండరని ఇంత పెద్ద వ్యవస్థలో లోపాలు ఉండడం సాధారణమే అన్న విధంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అవినీతి పట్ల ఇంత ఉదాసీనంగా ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు పలువురు.
గురువారం నాడు విజయవాడలో జరిగిన సెటిల్ మెంట్ శాఖ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం కేఈ. అనంతరం మాట్లాడిన ఆయన బుధవారం నాడు చంద్రబాబు నిర్వహించిన రెవెన్యూ సమీక్ష సమావేశాన్ని కొన్ని పత్రికలు కావాలనే వక్రీకరించాయని పేర్కొన్నారు కేఈ. అయితే రెవెన్యూ అవినీతిపై కథనాలు రాసినందుకే సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారని కొంతమంది కాలర్ ఎగిరేస్తున్నారని ఆరోపించారు కేఈ.