ఏపీ డిప్యూటీ సీఎం దంపతులకు కరోనా పాజిటివ్... ఆస్పత్రిలో చేరిక...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఆమె భర్త కూడా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో దంపతులు ఇద్దరు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్గా తేలడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పుష్ప శ్రీవాణి ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
గత నెలలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే... గడిచిన 24 గంటల్లో 60,124 శాంపిల్స్ ని పరీక్షించగా 14,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,352 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 423 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 13,02,589కి చేరింది.
గడిచిన 24గంటల్లో మరో 84 మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 8,791కి చేరింది. గత 24 గంటల్లో మరో 16,167 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటివరకు మొత్తం 11,04,431 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం(మే 10) సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.కరోనా రోగులకు అందుతున్న వైద్యం,ఆక్సిజన్ సప్లై,వ్యాక్సిన్ కొరత,కరోనా కట్టడి చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఆళ్ల నానితో పాటు కొవిడ్ కేర్ టాస్క్ఫోర్స్ అధికారులు, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.