డిప్యూటీ సీఎం కొత్త ఛాలెంజ్: సవాల్కు నిలిచేదెవరు.? అధికార పార్టీలో హాట్టాపిక్..!
విజయనగరం: లాక్డౌన్ నేపథ్యంలో దేశంమొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కోకొల్లొల్లు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ పనులు లేక ఇళ్లకే పరిమితమైన పేదప్రజలు జానెడు పొట్ట నింపుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. కొన్ని సార్లు పస్తులు కూడా ఉంటున్నారు. ఎవరో ఒకరు సహాయం చేయకపోరా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి కష్ట సమయాల్లో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. మనసున్న మారాజులు ఈ కష్టసమయాల్లో ఆదుకునేందుకు నడుంకట్టారు. సినీస్టార్స్ నుంచి స్పోర్ట్స్ స్టార్స్ వరకు.. పొలిటికల్ లీడర్స్ నుంచి సెలబ్రిటీలవరకు అంతా కదిలి వచ్చారు. ఈ విపత్కర సమయంలో తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి దంపతులు కూడా గొప్ప మనసు చాటుకోవడంలో ముందువరుసలో నిలిచారు. ఇంతకీ శ్రీవాణి ఏం చేశారు...?
స్వయంగా వంటచేసిన ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దంపతులు
కరోనా వైరస్ దేశాన్ని కబళిస్తోంది. ఈ మమమ్మారి ఒక మనిషిని మరో మనిషికి దూరం చేసింది. బంధాలను తెంచేసింది. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేసింది. పనిచేస్తే కాని నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని దుర్భర పరిస్థితిని చాలామంది ఎదుర్కొంటున్నారు. ఇక ఏపీలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనావైరస్ పరంగా పరిస్థితి అన్ని జిల్లాలకంటే చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ అక్కడ కూడా లాక్డౌన్ ఆంక్షలు ఉండటంతో పేద ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలకు నేనున్నానంటూ ముందుకొచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. పేదలకు తనే స్వయంగా వంట చేసి అందజేశారు. ఇక పుష్ప శ్రీవాణి భర్త వైసీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కూడా గెరిట తిప్పడం విశేషం. ప్రస్తుతం ఈ దంపతులు వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
ఛాలెంజ్ విసిరిన డిప్యూటీ సీఎం
ఇక కూరగాయలు తరుగుతూ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తమ శ్రేయోభిలాషులకు, కార్యకర్తలు ఇతర నేతలకు ఛాలెంజ్ విసిరారు. ఈ విపత్కర సమయంలో తమ స్తోమతను బట్టి పేద ప్రజలకు ఆహారం అందివ్వాలని అన్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. తాము 200 మంది పేదలకు ఆహారం ప్రిపేర్ చేసి వారికి అందజేస్తామని వీడియో ద్వారా చెప్పారు పుష్ప శ్రీవాణి. ఇక ఈ దంపతులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న వయస్సు అయినప్పటికీ అంత పెద్ద మనసు భగవంతుడు ఇచ్చాడంటూ కొందరు నెటిజెన్లు కామెంట్ చేశారు. ఈ కార్యక్రమం చేయడంపై మరికొందరు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్స్ సెక్షన్లో దంపతులను దీవించారు. ఇక ఈ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నట్లు ఇంకొందరు తమ ఇష్టాన్ని తెలిపారు.
వంట ప్రారంభం నుంచి ప్యాకింగ్ వరకు అంతా తామై..
లాక్డౌన్ వేళ పేదలకు అందజేసిన ఆహారం మెనూ కూడా చక్కగా ఉంది. అన్నం, సాంబార్, పెరుగన్నం, పచ్చడితో పాటు మంచినీళ్ల బాటిల్ను అందజేశారు. వంట పూర్తయిన తర్వాత వీటన్నిటినీ స్వయంగా డిప్యూటీ సీఎం దంపతులే ప్యాక్ చేయడం విశేషం. అంటే వంట ప్రారంభం అయినప్పటి నుంచి తయారైన ఆహారం ప్యాకింగ్ వరకు ఎవరి సహాయం తీసుకోకుండా ఈ దంపతులు చేయడం ఆకట్టుకుంది. ఇక ప్యాక్ చేసిన ఆహారాన్ని పేదలకు, బస్ షెల్టర్లలో జీవనం సాగిస్తున్నవారికి అందజేశారు. వంటను స్వయంగా డిప్యూటీ సీఎం తయారు చేశారని తెలుసుకున్న పేదలు హర్షం వ్యక్తం చేశారు. ఇక తమ ఛాలెంజ్ స్వీకరించి నలుగురికి ఈ విపత్కర సమయంలో సహాయం చేయాలంటూ ఈ దంపతులు పిలుపునిచ్చారు.