మొన్న వెండితెర పైన..నేడు విద్యార్థుల మధ్య: డిప్యూటీ సీఎం స్టెప్పులు వేస్తే..సంథింగ్ స్పెషల్
విశాఖ: పరిశోధనాత్మక స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, మానవాళిని పీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలతో ముందుకు రావాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు. విశాఖలో మూడురోజుల పాటు జరగనున్న సైన్స్ ఎగ్జిబిషన్ను మరికవలలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రశ్నించేతత్వమే సైన్స్ పుట్టుకకు కారణం అని చెప్పారు.
ఆమె పెళ్ళికి, రాజకీయానికి ఆసక్తికరమైన లింక్ ఉందన్న మంత్రి పుష్ప శ్రీవాణి
మానవజాతి అభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర
మానవజాతి అభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. మానవజాతిని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడం ద్వారా ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. గుహల్లో జీవనాన్ని ప్రారంభించిన మనిషి అక్కడి నుంచే అనేక విషయాలను కొనుగొని ఆవిష్కరించి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని పుష్పశ్రీవాణి చెప్పారు.
మనిషి మేదస్సును పూర్తి స్థాయిలో వినియోగిస్తే అద్భుతాలు
గత కొన్ని శతాబ్దాలుగా మనిషి కొన్ని ప్రశ్నల కోసం సమాధానాలు వెతుకుతూ వాటికి పరిష్కారాలు కనుగొన్నాడు కాబట్టే నేడు చంద్రుడి వరకు చేరుకోగలుగుతున్నాడని ఆమె చెప్పారు. ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని మనిషి 5శాతం మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పిన డిప్యూటీ సీఎం... మిగతా 95శాతం మేదస్సును ఉపయోగిస్తే ఎవ్వరూ ఊహించనన్ని అద్భుతాలకు తెరతీసే సామర్థ్యం ఉందని చెప్పారు.
స్టెప్పులతో జోష్ నింపిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
విద్యార్థులు బట్టీ చదువులకు ఫుల్స్టాప్ పెట్టి విషయాన్ని అర్థం చేసుకుని ఆదిశగా ప్రయత్నిస్తే భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు మంచి అవగాహన పెంపొందించుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్షీతో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విద్యార్థులతో కలిసి నాట్యం చేయడం కార్యక్రమానికే హైలైట్గా నిలిచింది. డిప్యూటీ సీఎం స్టెప్పులు వేయడంతో విద్యార్థుల్లో జోష్ కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆయుష్ పీజీ సీట్లలో గిరిజనుల రిజర్వేషన్లకు కృషి
అతి చిన్న వయస్సులోనే జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం స్థానం దక్కించుకున్న పుష్పశ్రీవాణి ఈ మధ్యే ఓ సినిమాలో టీచర్ పాత్ర వేస్తున్నారు. ఇక ఆయుష్ పీజీ కోర్సులో గిరిజనులకు రిజర్వేషన్లు వర్తించడం లేదన్న అంశం తన దృష్టికి రావడంతో వెంటనే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పీజీ సీట్లలో రిజర్వేషన్ వర్తించేలా కృషి చేయడంపై వైద్యవిద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక గిరిజన విద్యార్థుల కోసం గిరిజన ప్రాంతాల్లో పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు తీసుకురావడంలో కూడా పుష్పశ్రీవాణి కృషి చేశారు.