ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
హైదరాబాద్ : ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కొత్తగా నియమితులైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. గవర్నర్గా నియమించాక తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఏపీ, ఒడిశా మధ్య సుహృద్భావ సంబంధాల కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. తనది ఒడిశా .. అయినా ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతం కోసం పాటుపడతానన్నారు. ఏపీ సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తానని స్పష్టంచేశారు. విభజన సమస్యల పరిష్కారం, నదీ జలాల సమస్యపై ఫోకస్ చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున ఎగిసిపడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా నరసింహన్ కొనసాగుతున్నారు. యూపీఏ సర్కార్ నరసింహన్ పదవీకాలం పెంచుతూ వస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ గవర్నర్ను మారుస్తామని సంకేతాలు ఇచ్చానా .. మార్చే సాహసం చేయలేదు. కానీ ఇన్నాళ్లకు ఏపీకి గవర్నర్ను కేటాయించింది. అయితే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టడం .. సొంతంగా గవర్నర్ నియమించడంపై కాస్త ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీ 151 సీట్లతో పటిష్టంగా ఉండటంతో .. ఆ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని వాదన కూడా వినిపిస్తోంది.