జూనియర్ డాక్టర్ల పై దాడి అనుకోకుండా జరిగిందన్న డీజీపీ .. వైద్యుల ఆందోళనకు మద్దతుగా సమరం, రాజశేఖర్
ఏపీలో జాతీయ మెడిసిన్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని, తక్షణం చర్యలు చేపట్టి వైద్య విద్యార్థులలో స్థైర్యం నింపాలని డిమాండ్ చేశారు . ఇది హేయమైన చర్య అని వైద్య వర్గాలు దీన్ని ఖండించాయి. ఈ ఘటనలపై డీజీపీకి , హోం మంత్రికి ఫిర్యాదు చేశారు వైద్యులు . ఇక మరోవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎన్ఎంసి బిల్లును ప్రముఖ వైద్యులు సమరం, సినీనటుడు డా. రాజశేఖర్ వ్యతిరేకించారు .
మురుగునీళ్లలో కొత్తిమీర.. డర్టీ వ్యాపారం.. ప్రజారోగ్యం గాలికొదిలేసిన అధికారులు !!(వీడియో)
జూనియర్ డాక్టర్లపై దాడిపై దర్యాప్తుకు ఆదేశించాం .. అనుకోకుండా జరిగిన ఘటన అన్న డీజీపీ
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసి) బిల్లు నిరసనలో భాగంగా జరిగిన ఘటనలపై విచారణకు ఆదేశించింది పోలీస్ శాఖ . డిసిపి హర్షవర్ధన్ జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టడంపై ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సావాంగ్ స్పందిస్తూ, ఇది ఊహించని సంఘటన అని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని డిజిపి తెలిపారు. విశాఖపట్నంలో ఉన్న గౌతమ్ సవాంగ్ ఈ ప్రకటన చేశారు. ప్రతి కళాశాలలో వర్చువల్ పోలీస్ స్టేషన్ సమర్థవంతంగా పనిచేయడంలో రాష్ట్ర పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని ఏపి డిజిపి తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైనా విద్యార్థులు ఈ వర్చువల్ పోలీస్ స్టేషన్ల సహాయం తీసుకోవచ్చు అని ఏపి డిజిపి తెలిపారు.
ఎన్ఎంసి బిల్లుపై స్పందించిన సమరం .. అర్ధరహితమైన బిల్లు అని వ్యాఖ్య
ఇక ఏపీలో జరుగుతున్న డాక్టర్ల ఆందోళనకు ప్రముఖ వైద్యులు సమరం స్పందించారు. ఇప్పటివరకూ దేశంలో ఎంసీఐ ఉండేదని ఏదో అవినీతి జరిగిపోతోందని దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను కేంద్రం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు . ఇదివరకూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) సభ్యులను డాక్టర్లు ఎన్నుకునేవారు. కానీ మెడికల్ కమిషన్ లో మాత్రం నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరు ఐఏఎస్ కావొచ్చు. ఇంకెవరైనా గవర్నమెంట్ నామినేటెడ్ సభ్యులు ఉండవచ్చు. దీనివల్ల వైద్యరంగంలో ఏ,బీ,సీడీలు తెలియనివాళ్లు డాక్టర్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పిన సమరం ఇలాంటి చట్టం తీసుకురావడం నిజంగా అర్ధరహితం అన్నారు. కాబట్టి దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం' అని తెలిపారు.
బిల్లు వల్ల అనర్హులు సైతం డాక్టర్లుగా చలామణి అవుతారని పేర్కొన్న రాజశేఖర్
హైదరాబాద్ లోనూ జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించగా, టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కూడా సంఘీభావం ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్ఎంసీ బిల్లు ఆసరాతో ఆరు నెలల కోర్సు పూర్తి చేసి డాక్టర్ అవడం అనేది సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.ఈ ఆర్నెల్ల బ్రిడ్జి కోర్సు ద్వారా అనర్హులు సైతం డాక్టర్లుగా చలామణి అవుతారని రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి డాక్టర్ల కారణంగా జరిగే అనూహ్య సంఘటనలకు బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని తెలియజేశారు .