vizag gas leak: నీళ్లు చల్లితే అదుపులోకి: ఏపీ డీజీపీ, నిపుణుల కీలక సూచనలు
విశాఖపట్నం: జిల్లాలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ దుర్ఘటనపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
గ్యాస్ లీకేజీతో ఇరిటేషన్ ఎక్కువ
100, 108 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్లు రావడంతో పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే రంగంలోకి దిగినట్లు డీజీపీ సవాంగ్ తెలిపారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ వాయువు వల్ల ఇరిటేషన్ వస్తుందని, అంత తీవ్ర ప్రమాదం ఏమీ లేదని డీజీపీ తెలిపారు.
నీళ్లు చల్లితే గ్యాస్ ప్రభావం పోతుంది..
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ వల్ల ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారని, అయితే, నీళ్లు చల్లితే పరిస్థితి అదుపులోకి వస్తుందని డీజీపీ తెలిపారు. ఈ విషయ వాయువు వల్ల ఇప్పటి వరకు ఊపిరాడక ఆరుగురు మరణించారని, కిందపడి మరో ఇద్దరు చనిపోయారని డీజీపీ సవాంగ్ తెలిపారు. దీంతో ఈ ప్రమాద ఘటనలో మొత్తం 8 మంది మరణించారని చెప్పారు.
ఎలా జరిగిందీ ఘటన?
కంపెనీ ఉన్న గ్రామంలోని వారందరినీ ఆస్పత్రికి తరలించినట్లు డీజీపీ సవాంగ్ తెలిపారు. కంపెనీలో కూడా ప్రస్తుతం విషవాయువులు నియంత్రణలోకి వచ్చాయని చెప్పారు. గ్రామంలో నీటిని స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్యాస్ లీక్ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అనేదానిపై విచారణ కొనసాగుతున్నట్లు డీజీపీ సవాంగ్ తెలిపారు.
Recommended Video
ప్రభావిత ప్రజలకు కీలక సూచనలు
కాగా, గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే వారికి ఉపశమనం కలుగుతుందని నిపుణులు, కరోనా వాలంటీర్లు కొన్ని సూచనలు చేసశారు. నీటిని బాగా తాగడం, తప్పనిసరిగా తడి మాస్కు ధరించడం, ఇంటి దగ్గర ఉన్నా మాస్కు ధరించాల్సిందేనని చెప్పారు. కళ్ల మంట అనిపిస్తే వెంటనే కంటి చుక్కలు వేసుకోవాలి, ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్ సలహాతో సిట్రిజన్ మందులు వాడాలి. వాంతులు అయితే డామ్స్టాల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చని తెలిపారు. పాలు, అరటిపండ్లు, బెల్లం గ్యాస్ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు ఉపయోగపడతాయన్నారు. కంపెనీ సమీప ప్రాంతాల్లోని ప్రజలు మరో 48 గంటలపాటు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలని సూచించారు .