ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్ .. శాంతి భద్రతలలోనూ పోలీసుల పనితీరు భేష్ : ఏపీ డీజీపీ
రేపటి నుంచి పది రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ దినాలు జరపనున్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పోలీసులకు ఒక శుభవార్త చెప్పింది. పోలీసు శాఖలో ఉద్యోగులకు సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తాన్ని 1.5 లక్షల నుండి మూడు లక్షల రూపాయలకు పెంచుతూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం ప్రభుత్వం చేస్తున్న భీమాకు సంబంధించి ఎస్బిఐ సంస్థతో ఎంవోయూలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంతకం చేయించారు.
దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్
పోలీసుల భీమా పాలసీలు పెంపు .. సహజమరణం అయితే మూడు లక్షలు
ఇక రేపటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లలోనూ పోలీసులకు భీమా పాలసీలు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివ శంకర్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు పాలసీలు అందించారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మాట్లాడుతూ పోలీసులకు 40 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ పాలసీని, మూడు లక్షల రూపాయల వరకు సహజ మరణానికి సంబంధించిన పాలసీలను అందించనున్నట్లు తెలిపారు.
సంవత్సరానికి 12 రూపాయలు కడితే 2 లక్షల భీమా
సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే 2 లక్షల భీమా లభిస్తుందని పేర్కొన్నారు .సుకన్య సమృద్ధి యోజనను అందరూ వినియోగించుకోవాలని ఏపీ డీజీపీ తెలిపారు. పోలీసులు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి ఢోకా లేదని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదంటూ హితవు పలికారు. అంతేకాదు ఎస్ఈబీ ద్వారా అక్రమ మద్యాన్ని, ఇసుకను కట్టడి చేశామని డీజీపీ వెల్లడించారు.
పోలీసులకు వీక్లీ ఆఫ్ .. ఏపీ పోలీసుల సేవలు భేష్
దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీలో అమలు జరుగుతోందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్ ను రూపొందించామని, దిశ పోలీస్ స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. దిశ యాప్ ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని, రాష్ట్రంలో పోలీసు సేవ యాప్ ద్వారా 87 రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ శాఖ పనితీరుపై , రాష్ట్రంలోని శాంతిభద్రతలపై క్లారిటీ ఇచ్చారు.