ఆ దాడి చేసింది టీడీపీ నేతే- మీరు పోస్టులు పెట్టొద్దు -చంద్రబాబుకు డీజీపీ లేఖ...
చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు విపక్ష నేత చంద్రబాబు రాసిన లేఖ కలకలం రేపుతుండగానే ఈ లేఖకు సవాంగ్ నుంచి జవాబు కూడా వచ్చింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు వ్యవహారశైలిని తప్పుబడుతూ డీజీపీ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
చంద్రబాబు లేఖపై స్పందించిన డీజీపీ సవాంగ్... జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడిలో వాస్తవాలకు విరుద్ధంగా మీ లేఖ ఉందని, దాడిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. వాస్తవాలు ధృవీకరించకుండానే ఇటువంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని సవాంగ్ పేర్కొన్నారు.
అసలు ఆ దాడిలో టీడీపీ బలమైన అనుచరుడు ప్రతాప్రెడ్డి పాత్ర ఉందని తేలిందని, ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో రామచంద్ర స్వల్పంగా గాయపడ్డారని సవాంగ్ తెలిపారు. ఆ సమయంలో బాధితుడు రామచంద్ర మద్యం సేవించి ఉన్నారన్నారు. రామచంద్ర ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేశారని, సాక్షుల వాంగ్మూలం, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రతాప్రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని డీజీపీ తెలిపారు.
Recommended Video
మరోవైపు ప్రజల్లో అనుమానాలు రేకెత్తే విధంగా ఈ కేసులో చంద్రబాబు చేస్తున్న పోస్టులపై కూడా డీజీపీ ఫైర్ అయ్యారు. పోలీసు శాఖ చట్ట ప్రకారం పనిచేస్తుందని, అనుమానాలు రేకెత్తించే విధంగా లేఖలను పోస్ట్ చేయకుండా ఉండాలని చంద్రబాబును కోరుతున్నట్లు డీజీపీ తెలిపారు. మీకు ఏమైనా అనుమానాలుంటే సీల్డ్ కవర్లో పంపితే విచారణ చేస్తామని సవాంగ్ చంద్రబాబుకు సూచించారు. గతంలో జడ్జి రామకృష్ణ వ్యవహారంలోనూ చంద్రబాబు తీరుపై సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.