చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి: డీజీపీ
భట్టిప్రోలు బాలిక కిడ్నాప్ కేసులో నాగరాజు చాలా తెలివిగా వ్యవహరించాడని డీజీపీ వ్యాఖ్యానించారు. బాలికకు మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి, తనవైపు తిప్పుకునేలా చేశాడన్నారు.
గుంటూరు: ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చిన్నారుల మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సాంబశివరావు కీలక ప్రకటన చేశారు. 'చేతులు ఓడించి వేడుకుంటున్నా.. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి' అంటూ ఒక ప్రకటనలో తెలిపారు.
మరో 5 ఏళ్ళు లిఖితతో తప్పించుకోవాలనుకొన్నాడు, ఎటిఎం పట్టించింది
పిల్లల కదలికలను ఒక కంట కనిపెట్టాలని, ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? వంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని డీజీపీ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన భట్టిప్రోలు బాలిక(13) కిడ్నాప్ కేసులోనిందితుడు నాగరాజును మీడియా ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
సీఎం అడిగి తెలుసుకున్నారు:
బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు ముందే సరైన రీతిలో స్పందించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. సీఎం చంద్రబాబు సైతం కేసు విషయంలో తమకు ఫోన్ చేసి వివరాలు అడిగారని అన్నారు. తక్షణం నిందితున్ని అరెస్టు చేయాలని ఆయన ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈ కేసు పురోగతిపై నిత్యం తమను సంప్రదిస్తూనే ఉన్నారని అన్నారు.
పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు
భట్టిప్రోలు బాలిక కిడ్నాప్ తో సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో గమనించాలని తల్లిదండ్రులకు డీజీపీ సూచించారు. ఒక్క బాపట్ల సబ్ డివిజన్లోనే 6 నెలల వ్యవధిలో 16 మంది బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మంది బాలికల మిస్సింగ్ కేసులు నమోదువుతున్నాయని తెలిపారు. నరసరావుపేటలో ఓ బాలికను గల్ఫ్కు పంపిన కేసు విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు.
ప్రలోభ పెట్టి
భట్టిప్రోలు బాలిక కిడ్నాప్ కేసులో నాగరాజు చాలా తెలివిగా వ్యవహరించాడని డీజీపీ వ్యాఖ్యానించారు. బాలికకు మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి, తనవైపు తిప్పుకునేలా చేశాడన్నారు. ఆమె మేజర్ అయేంతవరకు వేచి చూస్తే.. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని అతను ప్లాన్ చేసినట్లు చెప్పారు.
అవగాహన సదస్సులు
నిందితిడికి టెక్నాలజీపై అవగాహన ఉండటంతో చాకచక్యంగా తమ నిఘా నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడని అన్నారు. నాగరాజు మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన 30సెల్ ఫోన్లపై నిఘా పెట్టిన ఎలాంటి క్లూ దొరకలేదన్నారు. విశాఖపట్నంకు చెందిన ప్రియురాలికి ఫోన్ చేయడంతో ఆచూకీ దొరికిందన్నారు. కిడ్నాప్ లు, అత్యాచారాలు, లైంగిక వేధింపులపై రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు నన్నపనేని రాజకుమారి తెలిపారు.