బాబు క్యాంప్ ఆఫీస్లో 8 లక్షలతో వాటర్ ప్లాంట్, గుంటూరులోనే సీఐడీ కార్యాలయం
అమరావతి: విజయవాడలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో (క్యాంఫ్ ఆఫీస్) తాగునీటి సౌకర్యం కోసం ఏపీ ప్రభుత్వం రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 8.10 లక్షలను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా పేరుతో సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి నివాసానికి వస్తున్న ప్రభుత్వ సిబ్బంది, సందర్శకులు, మీడియా ప్రతినిధులు, పోలీసులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వీటిని మంజూరు చేసినట్టు వివరించారు.
ప్రజల సందర్శనార్ధం తాగునీటి సరఫరా కోసం 250 లీటర్ల ప్లాంట్ ఒకటి, 100 లీటర్ల ప్లాంట్ మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు చేసే అంశంలో ప్రోటోకాల్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరులో సీఐడీ కార్యాలయానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్లో మరో కీలక శాఖ కార్యాలయానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. సీఐడీ నూతన కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు మెడికల్ కాలేజ్ వెనుక ఉన్న పోలీస్ క్వార్టర్స్ స్థలంలో ఈ సీఐడీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.
మొత్తం 2500 గజాల్లో రూ. 3.50 కోట్ల వ్యయంతో ఈ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. సీఐడీ నూతన కార్యలయానికి శంకుస్థాపన కార్యక్రమ అనంతరం డీజీపీ మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన వెంటనే సీఐడీ కార్యకలాపాలు ఇక్కడ నుంచే కొనసాగుతాయని తెలిపారు.