నిరుద్యోగులకు శుభవార్త: త్వరలో 12 వేల ఎస్సై, కానిస్టేబుల్, 2వేల డ్రైవర్ పోస్టులు
అమరావతి: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో 12 వేల ఎస్సై, కానిస్టేబుల్, రెండు వేల డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. ఈ నియామకాలను రెండు విడతల్లో చేపడతామని అన్నారు.
శుక్రవారం కర్నూలులోని మహానంది ఆలయాన్ని సతీసమేతంగా డీజీపీ సందర్శంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతూ ఉండటం వెనుక కొందరు పోలీసుల సహకారం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వెనుక పోలీసుల పాత్ర ఉందనేది ఓపెన్ సీక్రెట్ అయినా, దీనిని డీజీపీ స్థాయి వ్యక్తి అంగీకరించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రెడ్ శాండల్ స్మగ్లర్లతో చేతులు కలిపిన పోలీసులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో బ్రౌన్ షుగర్ పట్టుబడటంపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.
ర్యాగింగ్ నిరోధానికి వేసిన కమిటీ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. త్వరలోనే విజయవాడ నుంచి పోలీసు శాఖ పూర్తిస్థాయి పాలనా విధులు నిర్వర్తిస్తుందని ఆయన తెలిపారు.