ఒక్కరోజు ముందు భేటీలో మర్మమేంటీ, విశాఖ ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు
శాంతి భద్రతల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. విశాఖపట్టణం ఎయిర్పోర్టు ఘటనతో ఇది రుజువైందని ఆ పార్టీ విమర్శించింది. విశాఖలో చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు వర్ల రామయ్య నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం కలిసి విన్నవించింది. ఘటన గురించి తాను పత్రిక, టీవీ చానెళ్లలో చూశానని గవర్నర్ తమతో అన్నారని పేర్కొన్నారు. దీంతో శాంతి భద్రతలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అర్థమవుతోందని వర్ల రామయ్య ఆరోపించారు. ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను కాపాడాలని గవర్నర్ని కలిసి కోరామని చెప్పారు.
ఎవరికీ రక్షణగా..?
తమ వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వర్ల రామయ్య తెలిపారు. విశాఖలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన చంద్రబాబుకు పోలీసులు రక్షణగా ఉంటారా..? లేదంటే వైసీపీ శ్రేణులకు ఉంటారా అని ప్రశ్నించారు. ఆందోళన చేసిన నిరసనకారులను అరెస్ట్ చేయాలే తప్ప.. చంద్రబాబును అదుపులోకి తీసుకోవడం ఏంటీ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్లో ఈర్ష్య, అసూయ తగ్గలేదని ఫైరయ్యారు.
ఒక్కరోజు ముందు భేటీ..?
చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర రోజుకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డితో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అవడం వెనక ఉద్దేశం ఏమిటి అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ రోజు ఏమీ ఒప్పందం జరిగింది.. ఏ కుట్ర పన్నారు అని అడిగారు. విశాఖలో చంద్రబాబు నాయుడును అడుగుపెట్టనీయమని ముఖ్యమంత్రికి డీజీపీ హామీనిచ్చారా అని నిలదీశారు. ఒక్కరోజు ముందు సమావేశం అవడంతో తమకు అనుమానాలు కలుగుతాయని వర్ల రామయ్య తెలిపారు.
మొట్టికాయలు..
విశాఖ ఘటనలో పోలీసుల తీరును చూసి మిగతా పోలీసులు ఆశ్చర్యపోతున్నారని వర్ల రామయ్య చెప్పారు. పోలీసుల తీరుపై కోర్టును కూడా ఆశ్రయించామని చెప్పారు. కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని మొట్టికాయలు తింటుంది అని వర్ల రామయ్య నిలదీశారు.
పోలీసులే కదా..
విశాఖలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భాన్ని కూడా వర్ల రామయ్య వివరించారు. ఆ రోజు పారిశ్రామిక సదస్సు జరుగుతోందని.. ఆందోళన చేపట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకొద్దామని జగన్ ప్రయత్నం అని గుర్తుచేశారు. అందుకోసమే పోలీసులు జగన్ను ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారని చెప్పారు. అక్కడ ఏ ఒక్క టీడీపీ కార్యకర్త లేరు అని వివరించారు. పరిస్థితిని బట్టి పోలీసులే రానీయలేదని పేర్కొన్నారు. కానీ మొన్న జగన్ ప్రభుత్వం చేసిందేంటీ అని ప్రశ్నించారు.