పవన్ కళ్యాణ్ భద్రతపై అయోమయం లేదు: డీజీపీ, అభిమానులను నిరాశపర్చిన జనసేనాని
అమరావతి/శ్రీకాకుళం: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతపై ఎలాంటి అయోమయం లేదని డీజీపీ మాలకొండయ్య గురువారం తెలిపారు. స్థానిక నేతలు ఎస్పీలతో మాట్లాడితే భద్రతా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇందులో ఎలాంటి అయోమయానికి తావులేదని తేల్చి చెప్పారు.
Recommended Video
ఏపీలో బీజేపీ కుట్ర ఇలా: బెంగళూరులో చక్రం తిప్పుతున్న బాబు, మీరే ముందుకు రండి: మమత
మరోవైపు, పవన్ కళ్యాణ్కు ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. దీనిపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ మాట్లాడారు. జిల్లాలోని మూడు సబ్ డివిజన్ పోలీసులు అధికారులు జనసేనానికి భద్రతను కల్పించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. రోప్ పార్టీ, మఫ్టీ కాంపోనెంట్, ట్రాఫిక్ కంపోనెంట్, లా ఆండ్ ఆర్డర్ కంపోనెంట్, పీఎస్వోలు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ బస చేసే విడిది వద్ద కూడా భద్రత ఉంటుందన్నారు. భద్రత విషయంలో తాము ఎక్కడా రాజీ పడలేదన్నారు. పవన్ బౌన్సర్లపై దాడి జరిగినట్టు, వారికి దెబ్బలు తగిలినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పవన్కు సరైన భద్రత కల్పించలేదన్న ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
అభిమానులకు నిరాశ
పవన్కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురువారం యాత్రకు విరామం ప్రకటించారు. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం ప్రాంతంలోని ఓ రిసార్టులో బస చేశారు. సాయంతం, 6.45 గంటల ప్రాంతంలో పవన్ రిసార్టు వద్దకు రాగా, అప్పటికే ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరారు.
జాతీయ రహదారికి ఈ ప్రాంతం ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో రిసార్టు ప్రాంతం అభిమానులతో కోలాహలంగా కనిపించింది. పవన్ను చూడాలనుకున్నారు. కానీ ఆయన బయటకు రాలేదు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ వేచి చూసిన అభిమానులు, ఆపై నిరుత్సాహంతో వెనుదిరిగారు.