'చంద్రబాబుకు బెదిరింపు లేఖ ఓ ఎత్తుగడ, కొత్త మాటలు'
విశాఖ/అమరావతి: భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏపీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి శ్యాం పేరుట విడుదల చేసిన ప్రకటన పూర్తిగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సృష్టి అని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఒడిశాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో గాయపడిన, సమీప ప్రాంతాల్లో తలదాచుకున్న మావోయిస్టులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చేయడానికి వేసిన ఎత్తుగడ అన్నారు.
మావోయిస్టు పార్టీ పంథాకు వ్యతిరేకంగా ఆత్మాహుతి దాడులు చేస్తామని, కుటుంబ సభ్యులు లక్ష్యంగా చేసుకుంటామని కొత్త మాటలు వినిపిస్తున్నాయన్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఫ్రంట్ ఆర్గనైజేషన్లు చేస్తున్న ప్రకటనలను ఖండించారు.
బాబు, లోకేష్పై ఆత్మాహుతి దాడి లేఖపై ఎన్నో అనుమానాలుఎదురుకాల్పుల్లో గాయపడిన, సమీప ప్రాంతాల్లో దాక్కున్న మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ఎలాంటి హాని ఉండదని, వైద్యం చేయించి చట్టానికి అప్పచెబుతామన్నారు. మావోయిస్టుల ఫ్రంట్ ఆర్గనైజేషన్ల వారిని, విలేకర్లను తీసుకుని కూంబింగ్ జరుగుతున్న ప్రాంతంలో లొంగిపోయే మావోయిస్టుల కోసం ఎన్నిరోజులైనా వేచి ఉండడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారన్నారు.
అందర్నీ రక్షించుకుంటాం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్కు మావోయిస్టుల నుంచి వచ్చిన బెదిరింపు లేఖ పైన ఏపీ డీజీపీ సాంబశివ రావు గురువారం స్పందించారు. చంద్రబాబు సహా ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలను రక్షించుకుంటామని చెప్పారు.
ఏఓబీలో (ఆంధ్రా ఒడిశా బార్డర్) జరిగిన ఎన్కౌంటర్ బూటకమనిప్రజా సంఘాల నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏ మాత్రం తేడా వచ్చినా పోలీసులకు తీవ్ర నష్టం జరిగి ఉండేదన్నారు. ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలయ్యాయన్నారు.
దాదాపు 28 కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లిన పోలీసులు సాహసోపేతంగా మావోయిస్టులను ఎదుర్కొన్నారని వివరించారు. ఎన్కౌంటర్ అనంతరం ఎవరైనా మావోలు గాయపడి ఉంటే లొంగిపోవాలని, వారికి చికిత్స చేయించేందుకు సిద్ధమన్నారు.