ఫైర్: కుట్రకోణం కావొచ్చని డీజీపీ, జగన్ పార్టీపై మంత్రి
హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రాంతంలో గల అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చునని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు సోమవారం అన్నారు. ఈ ఘటన పైన ఆరు గ్రామాల ప్రజలను విచారించినట్లు చెప్పారు. దీని పైన లోతుగా దర్యాఫ్తు చేసి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు.
పంటపొలాల దహనం పైన గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ స్పందించారు. ఇది దురదృష్టకరమన్నారు. నిందితులను పట్టుకుంటామని చెప్పారు. రూరల్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ.. జరిగిన నష్టం స్వల్పమేనని, ఈ ఘటన పైన రైతులెవరు ఆందోళన చెందవద్దునని చెప్పారు.
పిరికిపందల చర్య: కామినేని
గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటన పిరికిపందల చర్య అని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. అగ్ని ప్రమాదాల పైన విచారణ జరిపిస్తున్నామని మరో మంత్రి చినరాజప్ప అన్నారు. ఘటనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హస్తముందనే అనుమానాలు ఉన్నాయన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.