కరోనా పుకార్లపై కన్నెర్ర చేస్తున్న ఏపీ డీజీపీ ... కేసులు పెడతామని వార్నింగ్
కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి మాట అటుంచి సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై జరుగుతున్న వైరల్ ప్రచారం ఇబ్బందికరంగా మారింది. తెలంగాణా రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో మొదలైన కలకలం అంతా ఇంతా కాదు.ఎక్కడ చూసినా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది . ఇది ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారైంది.
విశాఖ పోర్టుకు చైనా షిప్ .. కరోనా వైరస్ టెన్షన్ లో వైజాగ్ వాసులు
కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు ఏపీ సమాచారం
ఇక ఈనేపధ్యంలో ఏపీ సర్కార్ ప్రజలకు కరోనా వైరస్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పిన ఆరోగ్య శాఖ తాజాగా కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక అన్ని చర్యలు తీసుకుంటున్నామని, 24 గంటలు కంట్రోల్ రూమ్ లు పని చేస్తాయని ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ పై సమాచారం ఇస్తున్నా ప్రజల్లో మాత్రం భయం పోవటం లేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరోనా ఫేక్ పోస్ట్ లు
సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై ప్రచారం విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. కరోనా వైరస్ మన ప్రాంతంలో వచ్చిందంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో ఈ తరహా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపధ్యంలో ఏపీ డీజీపీ ఈ వదంతులపై కన్నెర్ర చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే సహించమని చెప్పారు.
సోషల్ మీడియా ప్రచారాలు నమ్మవద్దన్న డీజీపీ
కరోనా వైరస్ కు సంబంధించి ఏపీలో ఒక కేసు కూడా నమోదు కాకున్నా కరోనా వైరస్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ వదందులపై ఏపీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో చేస్తున్నవి తప్పుడు ప్రచారాలని, ప్రజలు ఎవరూ వాటిని నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్పై లేనిపోని అపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ వదంతులు సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కరోనా పై ఫేక్ పోస్ట్ లు పెడితే కేసులు నమోదు చెయ్యాలన్న డీజీపీ
వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు . సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులను పెడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలిచ్చారు. ప్రజల్లో అపోహలు తొలగించటానికే ప్రతి రోజూ రాష్ట్ర వైద్యాధికారులతో పాటు, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తున్నారని డీజీపీ తెలిపారు.