World Economic Forum 2020: దావోస్ వేదికగా సత్తా చాటిన కేటీఆర్.. ఏపీ మంత్రి మేకపాటి ఎక్కడ..?
అమరావతి: దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేసి సక్సెస్ అయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇన్వెస్టర్ల కోసం అవలంబిస్తున్న విధివిధానాలను వివరించి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బిజినెస్ టైకూన్లతో భేటీ అయ్యారు కేటీఆర్. లోటు బడ్జెట్తో ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇలాంటి వేదికలను అవకాశంగా మల్చుకోవాల్సి ఉండగా... ఆ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాత్రం కనిపించలేదు. దావోస్ ప్రపంచ ఆర్థిక సమావేశాలు శుక్రవారం ముగిశాయి.
మెగా ఈవెంట్లో కనిపించని ఏపీ ప్రాతినిథ్యం
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిథ్యం కనిపించలేదు. అప్పుల ఊబిలో ఉన్న ఏపీకి ఈ సమయంలో పెట్టుబడులు రావడం చాలా అవసరం. అయితే ఇలాంటి మెగా ఈవెంట్లో ఏపీ పాల్గొనకపోవడంపై పలువురు ఆర్థిక నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం అందిందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఒక వేళ ఆహ్వానం అంది ఉంటే అక్కడికి ఏపీ తరపున ఎవరూ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణ నుంచి పెట్టుబడుల విషయంలో సత్తా చాటిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్ ప్రపంచ ఆర్థిక సమాఖ్యలో పాల్గొని చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, కోకాకోలా సీఈఓ జేమ్స్ కిన్సీ, సేల్స్ ఫోర్స్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మెన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈఓ సుసాన్ వోజ్సికీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇన్వెస్టర్ల కోసం తాము తీసుకొచ్చిన పాలసీ గురించి వివరించారు కేటీఆర్. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ ఈ వేదికను పూర్తిస్థాయిలో అవకాశంగా మలుచుకున్నారు. అంతేకాదు ఫార్మా రంగంలో అగ్రగామి సంస్థ పిరమాల్ గ్రూప్ నుంచి రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కేటీఆర్ ఒప్పించగలిగారు. ఇక పలు అంతర్జాతీయ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చాయి. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు..?
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో బిజీగా ఉన్నారు. అంతేకాదు మూడు రాజధానుల అంశంపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి దావోస్కు వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించి ఉండి ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబుడులు రాకుండా తరలి వెళ్లిపోతున్న క్రమంలో ఇలాంటి ప్రపంచస్థాయి వేదికలను అవకాశంగా మలుచుకుని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వ్యవహరించి ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయంను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ఇందుకు సంక్షేమ పథకాలే తోడ్పాటును ఇవ్వలేవని.. పెట్టుబడులు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.