ఇంకా పెండింగ్ లోనే ఏపీ దిశ బిల్లులు-సాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం సమాధానం
ఏపీ దిశ బిల్లులు ఇంకా కేంద్ర వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లులు ఓసారి కేంద్రం తిరస్కరించింది. దీంతో మార్పులు చేసి మళ్లీ పంపారు. అయితే ఈసారి కూడా కేంద్రం వాటిపై నిశితంగా దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బిల్లుల ఆమోదం ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది.
ఏపీ ప్రభుత్వం పంపిన రెండు దిశ బిల్లులను పరిశీలన అనంతరం తమ అభిప్రాయాలను కలిపి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు. ఏపీ సర్కార్ ఆమోదించిన దిశ బిల్లు - క్రిమినల్ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు ఆమె తెలిపారు.
దిశ (క్రిమినల్ లా సవరణ) బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం శాఖ నుంచి గతేడాది జనవరి 21న తమ మంత్రిత్వ శాఖకు సమాచారం వచ్చిందని మంత్రి స్మతీ ఇరానీ చెప్పారు. ఈ బిల్లుపై తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు. అనంతరం మా అభిప్రాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరామని, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును మా మంత్రిత్వ శాఖకు పంపించిందని స్మ-తీ ఇరానీ వెల్లడించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి గత జూన్ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు.
మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచార నేరాలనుత్వరితగతిన విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉద్దేశించిన మరో బిల్లు 2020 జనవరి 29న హోం మంత్రిత్వ శాఖ నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు స్మతీ ఇరానీ తెలిపారు. దీనిపై కూడా తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా బిల్లును ఈ ఏడాది జనవరి 11న హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపిందని, దానిపై కూడా మా అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు తెలియచేశామని, ఈ రెండు దిశ బిల్లులు ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి ఇరానీ వెల్లడించారు.