'తెలంగాణ కారకుడు చంద్రబాబే, పదవులన్నీ ఓ సామాజిక వర్గానికే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మొదటి ముద్దాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. విభజన పైన చంద్రబాబు గురువారం రాత్రి విధాన పత్రం విడుదల చేసి, కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా శైలజానాథ్ ఈ రోజు కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందిగా లేఖ ఇచ్చి, రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలు పంచుకున్నారని చెప్పారు. చంద్రబాబు తాజాగా రూపొందించిన విధాన పత్రం ప్రత్యేక హోదా ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వద్ద చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని చూస్తే చంద్రబాబుకు వణుకు అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు.
చంద్రబాబు తన చేతగానితనాన్ని అంగీకరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య శుక్రవారం డిమాండ్ చేశారు. విధానపత్రంతో చంద్రబాబు దివాళాకోరుతనం బయటపడిందన్నారు. చంద్రబాబు పాలన ఒక సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందన్నారు.
పదవులన్నీ ఓ సామాజిక వర్గానికే వస్తున్నాయని మండిపడ్డారు. ఇందుకు ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కేంద్రమంత్రులే ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
మోడీ పార్లమెంటుకు రాకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లేవని, మోడీ తీరు చూస్తుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజు అనిపిస్తోందన్నారు.
రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు?: విశ్వరూప్
ధవళేశ్వరంలో సరిపడా నీటిమట్టం లేకుండానే పట్టిసీమ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని, రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారని వైసీపీ నేత విశ్వరూప్ వేరుగా ప్రశ్నించారు. పట్టిసీమ నిర్మాణం వల్ల కృష్ణా డెల్టాలో 35 టిఎంసిల నీరు కోల్పోతామన్నారు. పట్టిసీమ ఇంకా పూర్తి కాలేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణం నాసిరకంగా ఉందన్నారు.