ఏపీ ప్రభుత్వంపై విమర్శల ఫలితం - నర్సీపట్నం డాక్టర్ సస్పెన్షన్ - కేసులు కూడా..
ఏపీ ప్రభుత్వం కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వారికి సరైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం లేదంటూ ఆరోపణలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పై వేటు పడింది. డాక్టర్ విమర్శలను సీరియస్ గా పరిగణించిన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం కలకలం రేపుతోంది.
ప్రభుత్వంపై విమర్శలు- డాక్టర్ సస్పెన్షన్..
ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతుండగా.. రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ పరికరాలు, కిట్ల కొరత కూడా వేధిస్తోంది. ఇదే క్రమంలో విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిన్న ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రక్షణ కిట్లు లేకుండా వైద్యం ఎలా చేయాలంటూ ప్రశ్నించారు. లేవనెత్తిన విషయం సరైనదే అయినా ఎంచుకున్న మార్గంపై విమర్శలు రావడంతో ఏపీ వైద్య విధాన పరిషత్ ఇవాళ దీనిపై స్పందించింది. ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగిన డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు విధించింది.
విమర్శలపై కేసులు కూడా నమోదు...
జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం, తన మాటల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి పలు నేరాల కింద డాక్టర్ సుధాకర్ పై కేసులు నమోదు చేసినట్టు నర్సిపట్నం టౌన్ సీఐ స్వామి నాయుడు తెలిపారు.
సుధాకర్ విమర్శలపై రాజకీయ దుమారం..
వాస్తవానికి డాక్టర్ సుధాకర్ కరోనా వైద్యం విషయంలో ప్రభుత్వ వైఖరిని నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమో లేక తన ఆవేదనను సరైన వేదికపైనో పంచుకుని ఉంటే సరిపోయేది. అలా కాకుండా ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. స్ధానిక నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్.. డాక్టర్ సుధాకర్ గతంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయడం, టీడీపీ నేతలు దానికి కౌంటర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారం మరింత ముదరకముందే డాక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇప్పించింది.
Recommended Video