సీఎం జగన్ కు ఏపీ డాక్టర్ల సంఘం లేఖ- సుధాకర్ ఉదంతం తర్వాత అవే డిమాండ్లతో..
ఏపీ సీఎం వైఎస్ జగన్కి.. ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ ఇవాళ ఓ లేఖ రాసింది. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖలో పేర్కొంది. విధి నిర్వహణలో చనిపోయిన డాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించ లేదు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా చనిపోయిన డాక్టర్స్కి కోట్ల రూపాయల పరిహారం ఒక్కొక్కరికి ప్రకటించాలని డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
డీఎంఈ పరిధిలో ఉన్న వైద్యులకు గత 15 ఏళ్లుగా పీఆర్సీ ఇవ్వలేదని డాక్టర్లు ఈ లేఖలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంహెచ్ పరిధిలోని డాక్టర్ల జీతాలకు, డీఎంఈ పరిధిలో ఉన్న తమ జీతాలకు ఎంతో తేడా ఉందని, డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్యుల జీతాలు చూసి కుమిలిపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ డాక్టర్లు పదోన్నతులకే నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు ఇతర రాష్ట్రాల్లో అన్ని ఇన్సెంటీవ్లు ఇస్తున్నా ఏపీలో మాత్రం ఇవ్వడం లేదని పేర్కొన్న అసోసియేషన్... కరోనా రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు అన్ని అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
వాస్తవానికి డాక్టర్ల సంఘం తమ సమస్యల కోసం ప్రభుత్వానికి లేఖ రాయడం వింతేమీ కాకున్నా గతంలో కోవిడ్ విధుల్లోని డాక్టర్ల పరిస్దితిపై బహిరంగ వ్యాఖ్యలు చేసిన సుధాకర్ ఉదంతం తర్వాత ప్రభుత్వానికి డాక్టర్ల సంఘం ఇలా లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో డాక్టర్ సుధాకర్ వివిధ సందర్భాల్లో ఇవే అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనే ఆయనపై అప్పట్లో చర్యలు తీసుకున్నారు.