డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం...ఎట్టకేలకు...!
అమరావతి:రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ మరో 48 గంటల్లో విడుదల కానుంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈ నోటిఫికేషన్ కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు తెలిసింది.
శుక్రవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ డిఎస్సీలో 7 వేల 500 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ డీఎస్సీకి సంబంధించి రాతపరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదలకు మళ్లీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సీ-2018 నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది. ముందుగా అనుకున్న ప్రకారం 15 రోజుల క్రిందటే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సింది. అయితే పోస్టులు, తదితర అంశాలపై స్పష్టత రాలేదని విద్యాశాఖ అధికారులు చెప్పడంతో అలా మూడోసారి కూడా వాయిదా పడింది.
తొలుత ప్రకటించిన షెడ్యూల్లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 12,370 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రెండోసారి ప్రకటించిన షెడ్యూల్లో వాటిని 10,351 పోస్టులుగా చూపించారు. మూడో సారి ప్రకటించిన షెడ్యూల్లో ఈ పోస్టులను 6,100కు కుదించారు. కానీ ఫైనల్ గా ఈ పోస్టుల సంఖ్య 7,500 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే ఎస్జీటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు కూడా అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజరుజైన్ ఇందుకు సంబంధించిన జీవో 66ను విడుదల చేయడం జరిగింది. ఎస్జిటి పోస్టులకు బిీడి అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సిఈఆర్టి ఈ ఏడాది ఆగస్టు 23న గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణ చేసింది.