ఏపీలో డీఎస్సీ, టెట్ షెడ్యూల్స్ విడుదల: జులై 6న నోటిఫికేషన్, మే4న టెట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురునందించింది. జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
మొత్తం 10,351 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నామని గంటా శ్రీనివాస్ వెల్లడించారు. జూలై 7 నుంచి ఆగస్టు 9వరకు డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఆన్లైన్లో డీఎస్సీ నిర్వహణ ఉంటుందని, ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని యోచిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఆగస్టు 1 నుంచి ఆన్లైన్లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటుదని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటలకు వరకు అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 10న ఫైనల్ కీని విడుదల చేస్తామని, అలాగే సెప్టెంబర్ 15న ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆరు కేటరగిల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. పోస్టుల వివరాలు: ఎస్జీటీ-4,967,ఎస్ఏ-2978,లాంగ్వేజ్ పండిట్స్- 312,పీఈటీ-1056 మ్యూజిక్,డాన్స్-109,మోడల్ స్కూల్స్- 929.
ఏపీ టెట్ షెడ్యూల్ కూడా మంత్రి గంటా విడుదల చేశారు. మే 4న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 5 నుంచి మే 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ఉండనుంది. అలాగే జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. జూన్ 10 నుంచి 21వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 28న ఫైనల్ కీ, జూన్ 30న పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి కల్లా నూతనంగా నియమించబడిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే విధంగా జూన్ 12 నాటికి నియామకాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని గంటా తెలిపారు.