ఏపీ ఎంసెట్ 2018: హాల్ టిక్కెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు బుధవారం అంటే ఏప్రిల్ 18 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి తమ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఆన్ లైన్ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ప్రక్రియ మంగళవారం నాడు సాయంత్రం వరకు పూర్తి కాలేదు. దీంతో హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్ ప్రక్రియలో ఆలస్యమైంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
కాకినాడ జేఎన్టీయూ ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది పరీక్షకు 2,74,917 మంది విద్యార్థులు ఎంసెట్కు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ కోసం 1,98,231 మంది దరఖాస్తులు చేసుకోగా అగ్రికల్చరల్ కోర్సులకు 76,686 మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంజినీరింగ్ పరీక్ష 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, వ్యవసాయం, వైద్య పరీక్షలు 25, 26వ తేదీల్లో జరగనున్నాయి.
హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు మే 5వ తేదీన వెల్లడిస్తారు. హాల్ టిక్కెట్లను sche.ap.gov.in/eamcet నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.