వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిడెడ్ పోరు రాజకీయమే-బలవంతపు విలీనాల్లేవ్-దుస్ధితికి టీడీపీదే బాధ్యత-మంత్రి సురేష్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్న జగన్ సర్కార్ ప్రయత్నాలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ దీనిపై స్పందించారు. ఇప్పటికే సీఎం జగన్ కూడా బలవంతపు విలీనాలు ఉండబోవని చెప్తున్నా స్కూళ్లు మూతపడుతుండటంతో విద్యార్ధుల తల్లితండ్రులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యామంత్రి స్పందించారు.

ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ.. కొన్ని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో కొన్ని వాస్తవాలను చెప్పేందుకు తాను స్పందిస్తున్నట్లు విద్యామంత్రి సురేష్ తెలిపారు. ప్రైవేట్‌ యాజమాన్యం కింద నడిచే విద్యాసంస్థల పనితీరుపై సర్కార్ వేసిన కమిటీ నివేదికలో వెలుగు చూసిన పలు అంశాలు ఆశ్చర్యానికి గురిచేశాయని సురేష్ వెల్లడించారు. . అ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
దీర్ఘకాలికంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఎయిడెడ్‌ స్కూళ్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆయన తెలిపారు.

ap education minister adimulapu suresh clarified on private aided schools merger row, slams tdp

మరికొన్ని చోట్ల యాజమాన్యాల తగదాల వల్ల, ఉపాధ్యాయులకు, యాజమాన్యాలకు సఖ్యత లేకపోవడం వల్ల కొన్ని స్కూళ్లు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు.. అలాగే కొన్నిప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆ స్కూళ్లల్లో చేరని పరిస్థితులు నెలకొనిఉన్నాయన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని కమిటీ నివేదిక ఇచ్చిందని విద్యామంత్రి సురేష్ తెలిపారు. ఒకవేళ ప్రయివేట్‌ యాజమాన్యాలు... స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే మెరుగ్గా నడిపించుకోవాడానికి, స్కూళ్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ, ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ ఉపాధ్యాయులను నియమిస్తూ, ఆస్తులతో పాటు ఇస్తే వాటితో నాడు-నేడు ద్వారా ఆయా విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవచ్చంటూ కమిటీ నివేదికలో పేర్కొందన్నారు. అందులో భాగంగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే ఈ అంశంపై కొన్ని పత్రికలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని విద్యామంత్రి సురేష్ ఆరోపించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం విలీనం చేసుకుంటే స్కూళ్లు మూతపడిపోతాయని... విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారంటూ.. అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏ ఒక్క ప్రైవేట్‌ యాజమాన్యాన్ని బలవంతం పెట్టడం జరగలేదన్నారు. యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించకుండా కచ్చితంగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదన్నారు.. ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌లను కూడా మంత్రి సురేష్ మీడియా ముందు ఉంచారు.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు... "తమకు గ్రాంట్‌ అవసరం లేదు, ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్‌ చేసి, ప్రైవేట్‌ విద్యాసంస్థలుగా నడుపుకుంటామని" యాజమాన్యాలు ఇచ్చే విల్లింగ్‌నెస్‌తో పాటు ఉపాధ్యాయుల ఇచ్చే విల్లింగ్‌నెస్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని అలాంటి విద్యా సంస్థలను మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఆప్షన్‌ను చాలా స్పష్టంగా వారికి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీలు, వాటిలో ఏడు డిగ్రీ కాలేజీలు మేనేజ్‌మెంట్‌, స్టాఫ్‌తో పాటు, వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తున్నామంటూ చాలా స్పష్టంగా, రాతపూర్వకంగా ఇచ్చాయన్నారు. దీని ప్రకారం 124 డిగ్రీ కాలేజీలు కేవలం స్టాఫ్ ను మాత్రమే సరెండర్‌ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని, ప్రైవేట్‌ కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయని విద్యామంత్రి సురేష్ తెలిపారు. - 93శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్‌నెస్‌ను ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం బలవంతంగా తమ విద్యాసంస్థలను తీసుకున్నాయని, తామే నడుపుకుంటామని చెబితే అందుకు మాకెలాంటి అభ్యంతరం లేదని సురేష్ వెల్లడించారు.

పిల్లలకు చదువు చెప్పే ప్రమాణాలు బాగా దిగజారిపోవడం, విద్యాసంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్లే యాజమాన్యాలు ఇవ్వదలచుకుంటే వాటిని తీసుకుని నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా నడపాలని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రిగారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని విద్యామంత్రి తెలిపారు. 122 ఎయిడెడ్‌ జూనియర్ కాలేజీలు ఉంటే.. అయిదు జూనియర్‌ కాలేజీలు ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం స్టాఫ్‌తో పాటు మొత్తంగా 108 జూనియర్‌ కాలేజీలు అంటే మొత‍్తంగా 88.5 శాతం ప్రైవేట్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తాము స్వచ్ఛందంగా ఆప్షన్లు ఇచ్చాయని విద్యామంత్రి వెల్లడించారు.

స్కూళ్ల విషయానికి వస్తే... దాదాపు 1,988 స్కూళ్లు ఉంటే 1,200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్‌తో పాటు ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని రాతపూర్వకంగా ఇచ్చాయన్నారు. అలాగే 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్‌ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. మొత్తంగా 1302 స్కూళ్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. విశాఖలో సెంట్‌ పీటర్స్‌, కాకినాడలో సెంట్‌ యాన్స్‌ స్కూళ్ల యాజమాన్యాలు "తాము స్కూళ్లు మూసివేస్తున్నామని, ప్రభుత్వం బలవంతంగా ఎయిడెడ్‌ స్కూళ్లను లాక్కున్నది కాబట్టి మీ పిల్లల్ని వేరే స్కూళ్లలో చేర్చుకోండని" ఏదైతే చెప్పడం జరిగిందో దానివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని విద్యామంత్రి తెలిపారు. ఇప్పటికైనా ఆ స్కూళ్ల యాజమాన్యాలు తామే నడుపుకుంటామని చెబితే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ విల్లింగ్‌నెస్‌ ఇచ్చినా.. విత్‌డ్రా చేసుకుంటామంటే వారి ఆప్షన్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చన్నారు. ఇక అక్కడ చదువుతున్న విద్యార్థులను సమీపంలోని పాఠశాల్లలో చేర్చుకునేందుకు మ్యాపింగ్‌ చేయడానికి కూడా ఒక టైమ్ టేబుల్‌ వేయడం జరిగిందన్నారు. సరెండర్‌ చేసిన ఉపాధ్యాయులకు పోస్టింగ్స్‌ ఇచ్చేందుకు నెలాఖరున వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమీపంలోని పాఠశాలల్లో అయినా లేకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనుకుంటే అక్కడైనా వారిని చేర్పించేవరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని విద్యామంత్రి సురేష్ తెలిపారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంశాన్ని రాజకీయం చేసి మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీనే ఇందుకు బాధ్యత వహించాలన్నారు.. ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూళ్లను ఈ స్థితికి తీసుకువచ్చి, వాటిలోని ఖాళీలను టీడీపీ సర్కార్‌ ఎందుకు భర్తీ చేయలేదని ఆయన నిలదీశారు.

English summary
ap education minister adimulapu suresh on today clarified on private aided schools merger row and slams tdp for this menace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X