ఏపీలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ప్రచారం- ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ క్లారిటీ..
ఏపీలో కరోనాతో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఈ నెలలో నిర్వహించేందుుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఈ మేరకు కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నెల 9 నుంచి 11 వరకూ మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు, 21న పోలింగ్ ఉంటుందని, 24న కౌటింగ్ నిర్వహించబోతున్నట్లు ఏకంగా ఈసీయే షెడ్యూల్ ఇచ్చినట్లు ప్రచారం సాగింది.
దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఎస్ఈసీ తేల్చేసింది. ఇదంతా కావాలని కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఇందులో స్ధానిక ఎన్నికల కోసం తాము ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని పేర్కొంది.
Recommended Video
ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రభావం కారణంగా అప్పటికే మొదలైన స్ధానిక ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఆ తర్వాత ఇదే విషయంపై ఆయన ప్రభుత్వ ఆగ్రహానికి గురై పదవి కూడా కోల్పోయారు. తిరిగి న్యాయపోరాటం ద్వారా తిరిగి పదవి దక్కించుకున్న నిమ్మగడ్డ రాష్ట్రంలో ఎన్నికలకు ఉన్న అవకాశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్లో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దమవుతోందంటూ ప్రచారం సాగింది. దీన్ని ఎస్ఈసీ ఖండించింది.