వెళ్తూ.. తెలంగాణ ఉద్యోగుల్ని కదిలించిన ఏపీ ఉద్యోగి లేఖ, కంటతడి
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదులో నవ్యాంధ్ర సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలారు. శుక్రవారం నాడే హైదరాబాదులో వారి చివరి పని దినంగా మారింది. శనివారం, ఆదివారం విరామం తర్వాత సోమవారం (అక్టోబరు 3) నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే వారు పని చేస్తారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోని సచివాలయానికి భావోద్వేగంతో కూడిన వీడ్కోలు పలికారు. అదే సమయంలో హైదరాబాద్ సచివాలయాన్ని వీడి వెళ్తూ ఏపీ ఉద్యోగి రాసిన లేఖ రెండు రాష్ట్రాల ఉద్యోగులను కదిలిస్తోంది.
కళ్లేకాదు గుండె కారుస్తోంది నీరు అనే పేరుతో లేఖ రాశారు. కాటమరాజు పేరుతో రాసిన దీనిని పలుచోట్ల అతికించారు. ఇది తెలంగాణ ఉధ్యోగుల గుండెను కూడా పిండింది. ఆ లేఖలో ఇలా ఉంది. 'అనంత కాలప్రవాహంలో చరిత్రలో ఎన్నో మలుపులు. ఈ మలుపులు కొంతమందికి సంతోషాన్ని, మరికొంతమందికి బాధను కలుగజేస్తాయి. ఇంకొంతమందికి రెండింటినీ కలుగజేస్తాయి. ఈ మలుపు మనసును మెలిపెడుతోంది.
కొన్ని సంవత్సరాలు ఇక్కడి గాలిపీల్చాం. ఇక్కడి నీళ్లు తాగాం. ఇక్కడి ప్రజలతో కలిసిపోయి పరిచయాల్ని స్నేహాల్ని పంచుకొని, కొంతమందితో ఏకంగా బంధాల్నీ, బంధుత్వాన్ని పెంచుకొని నడయాడిన నేలను వీడుతున్న వేళ.. కళ్లేకాదు గుండె నీరు కారుస్తుండగా సెలవు అడుగుతున్నాం.
ఏ బంధం ఒక్క జన్మలో బలపడదు. అది అనేక జన్మల సంబంధాన్ని కలిగి ఉంటుంది. మిమ్మల్నందరినీ కొత్త సచివాలయానికి ఆహ్వానిస్తూ... జ్ఞాపకాలతో మీ కాటమరాజు.' అని రాశారు.
బోసిపోయిన ఏపీ సచివాలయం
ఉద్యోగులు, ఫైళ్లు, ఫర్నీచర్ తరలిపోవడంతో హైదరాబాద్లోని ఏపీ సచివాలయం మూగబోయింది. ఉద్యోగులకు శనివారం సెలవు ప్రకటించినప్పటికీ కొంతమంది సచివాలయానికి వచ్చారు. మరోపక్క కార్యాలయాల్లో మిగిలి ఉన్న ఫైళ్లు, కంప్యూటర్ల తరలించారు.
ఉద్యోగులందరూ ఒకరికొకరు తమ అనుభూతులను పంచుకున్నారు. హైదరాబాద్ను, సచివాలయాన్ని వదిలివెళ్లడం బాధగా ఉన్నా తప్పడం లేదంటూ కొందరు భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది ఉద్యోగులు కంటతడి పెట్టుకున్నారు. జ్ఞాపకాలు పదిల పరుచుకునేందుకు అందరూ కలిసి ఫొటోలు దిగారు.