చంద్రబాబుకు షాక్ : అమరావతికి వచ్చేది లేదన్న ఏపీ ఉద్యోగులు
విజయవాడ : అదనపు సౌకర్యాలు కల్పించి మరీ.. ప్రభుత్వ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి రావాలని విజ్నప్తి చేస్తే.. ససేమిరా అంటున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడింది ఏపీ సర్కార్. అవసరమైతే స్వచ్చంద విరమణకైనా సిద్దమే అంటున్నారు గానీ హైదరాబాద్ ను వదిలి అమరావతికి వచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు.
వీలైనంత త్వరగా ఏపీ పరిపాలనా విభాగాన్ని కొత్త రాజధాని అమరావతికి మార్చేయాలని చూస్తోన్న సర్కార్.. జూన్ చివరినాటికి ఈ తతంగం మొత్తం పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే వెలగపూడి వద్ద నిర్మిస్తున్నతాత్కాలిక సచివాలయ పనులపై కూడా ప్రత్యేక ఫోకస్ చేసింది. సచివాలయ పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ మంత్రి నారాయణ తాత్కాలిక సచివాలయంలో వచ్చే నెల 27 నుంచి ఉద్యోగులు సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బుధవారం ఉదయం సచివాలయ నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించిన ఆయన.. సచివాలయంలో 3,4 అంతస్థుల నిర్మాణానికి కూడా టెండర్ల ప్రక్రియ మొదలయిందన్నారు.
ఇదిలా ఉంటే.. అమరావతికి తరలి వచ్చే ఉద్యొగులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ 30 శాతం అదనపు హెచ్ఆర్ఏ తో పాటు, వారానికి 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇన్ని చేసినా..! కొంతమంది ఉద్యోగులు మాత్రం హైదరాబాద్ నుంచి కదిలేందుకు సుముఖంగా లేకపోవడం గమనార్హం. అమరావతికి వెళ్లడం కన్నా హైదరాబాద్ లో ఉండిపపోవడమే మేలు అని భావిస్తున్న కొంతమంది ఉద్యోగులు వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) కి కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇప్పటికే చాలామంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఆరు దరఖాస్తులకు ఆర్థిక శాఖ కూడా ఓకె చెప్పేసింది. ఇవిగాక మరో పది వరకు దరఖాస్తులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 25 మందికి పైనే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా సమాచారం. కాగా.. రిటైర్ మెంట్ దగ్గర పడ్దాక ఊళ్లు పట్టుకుని తిరగడం కన్నా..! ఉన్న చోటే ఉండిపోయేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉద్యోగులు ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.