జగన్ సర్కార్ కు ఉద్యోగుల నోటీసు-7 తర్వాత ఉద్యమం-బుగ్గన వల్లే గ్యాప్-జగన్ స్పందించాల్సిందే
ఏపీలో ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో గుర్రుగా ఉన్న ఉద్యోగులు ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ సీఎస్ సమీర్ శర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 7లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమంలోకి వెళ్తామని హెచ్చరికలు చేశారు.
ఉద్యోగుల పోరుబాట
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ కొంతకాలంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. పీఆర్సీతో పాటు డీఏ బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కారుణ్య నియామకాలపై కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరు ఉధృతం చేయాలని నిర్ణయించాయి. తాజాగా పీఆర్సీని సైతం అక్టోబర్ చివర్లోగా ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఇక ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
భవిష్యత్ కార్యాచరణపై ఉద్యోగుల నోటీసు
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్న ఉద్యోగసంఘాలు.. ఇవాళ సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిశాయి. ఏపీ జేఏసీ,ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ నోటీసును ఆయనకు అందించాయి. తమ సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకపోతే ఉద్యమం తప్పదని అందులో హెచ్చరించాయి. ఈ నెల 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ చెప్పడంతో ... అప్పటిలోగా పరిష్కారం కాకపోతే ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్లాల్సి ఉంటుందని ఉద్యోగులు హెచ్చరించారు.
ఉద్యమానికి ప్రభుత్వమే కారణం
పీఆర్సీ ఇవ్వాలని... డీఏ బకాయిలు ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నామని ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు.. కన్నిటి మూటలే అయ్యాయని ఆయన ఆరోపించారు. ఉద్యమ కార్యాచరణను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వమే అన్నారు. ఇప్పటికీ పీఆర్సీ నివేదికను ఇవ్వలేదని, ఏడో తేదీలోగా సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ సమీర్ శర్మ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. జీపీఎఫ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
పీఆర్సీ మార్చే అధికారం లేదన్న బొప్పరాజు
ఐదు పేజీల వినతి పత్రాన్ని సీఎస్ సమీర్ శర్మకు ఇచ్చినట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. దీన్ని ఉద్యమ కార్యాచరణ నోటీసు రూపంలో అందించామన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని సజ్జలే హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నామని, ఈ ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆ తర్వాత తామూ సహకరించినట్లు ఆయన పేర్కొన్నారు. పీఆర్సీ నివేదిక ఇచ్చి మూడేళ్లైనా.. విడతల వారీగా డీఏలు ఇస్తామన్నా.. జీతాల్లో 50 శాతం పెండింగులో పెడతామన్నా సహకరించామన్నారు. కరోనా సమయంలో 4-5 వేల మందికి ఉద్యోగులు చనిపోయారని, కానీ కారుణ్య నియామకాలు జరపలేదన్నారు. ఆర్ధికేతర సమస్యలను కూడా పరిష్కరించడం లేదని బొప్పరాజు తెలిపారు. చట్టబద్దంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. పీఆర్సీ నివేదిక తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ఆయన అన్నారు. అంతటి కీలకమైన పీఆర్సీ నివేదికను కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. పీఆర్సీ నివేదికలోని అంశాలు మాకు చెప్పకూడని అంశాలేమేమైనా ఉన్నాయా అని బొప్పరాజు ప్రశ్నించారు.
ఉద్యోగుల్ని కించపరిచేలా బుగ్గన కామెంట్స్
ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాటలు ఉద్యోగులని కించపరిచే విధంగా ఉన్నాయని బొప్పరాజు ఆరోపించారు. పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక మంత్రి ఉద్యోగులతో చర్చలు జరపడం సంప్రదాయమని, కానీ బుగ్గన ఒక్క రోజైనా ఉద్యోగులతో మాట్లాడారా..? అసలు బుగ్గన అందుబాటులో ఉన్నదెప్పుడు..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి బుగ్గన చెప్పేదంతా అబద్దమని,.. ప్రభుత్వానికి ఉద్యోగులకు బుగ్గన గ్యాప్ పెంచుతున్నారని బొప్పరాజు ఆరోపించారు. మాకు రావాల్సిన కూలీలను మాత్రమే మేం అడుగుతున్నామని,. అంతకు మించి అడగొద్దని మంత్రి బుగ్గన గుర్తించాలని బొప్పరాజు తెలిపారు.
మేం రెండో దశ ఉద్యమంలోకి వెళ్లే లోపే ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. సీఎం జగన్ స్పందిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని అర్ధమవుతోందన్నారు.