ఎపి ఉద్యోగుల పిల్లలకు స్థానికత సమస్య: మారేందుకు షరతు
విజయవాడ : హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఉద్యోగుల పిల్లలకు స్థానికత అనేది సమస్యగా మారింది. వారికి ఎపిలో వారిని స్థానికులుగా గుర్తిస్తారా, లేదా అనే సందేహం ఎపి ఉద్యోగులను కలిచివేస్తోంది. ఈ స్థితిలో తమ పిల్లలకు స్థానికత కల్పించాలని ఏపీ ఎన్జీవోలు ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.
విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగులు ఏపీకి బదిలీ అయితే వారి పిల్లలు నష్టపోయే అవకాశం ఉందని ఎన్జీవోలు ప్రభుత్వానికి తెలిపారు. బుధవారం విజయవాడలో మంత్రులు, ఐఏఎస్ అధికారులను ఏపీఎన్జీవో నేతలు కలిశారు.
40 వేల ఎకరాలు అన్యాక్రాంతం
ఇదిలావుంటే, రాష్ట్రంలో మొత్తం 60, 770 ఎకరాల వక్ఫ్ భూములుండగా అందులో 40 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాధ్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.
అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను జీవో నెం 18 ద్వారా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అలాగే ముస్లింల వివాహ పథకం ద్వారా వివాహం చేసుకునే జంటకు ప్రభుత్వం తరుపున రూ. 50వేలను చెల్లిస్తామన్నారు. నెల్లూరులో మరో షాదీమంజిల్ను నిర్మిస్తామని, అంతేగాక రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుతామన్నారు.
రెండు నెలల్లో ఎనిమిది లక్షల కొత్త రేషన్కార్డులను పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. బుధవారం అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలకతీతంగా దీపం కనెన్షన్లు మంజూరు చేస్తామని ఆమె అన్నారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.