విశాఖలో ఖరారు కాని సచివాలయం- ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఇబ్బందులను అధిగమించేందుకు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం విశాఖలో అందుకు అనుగుణంగా భవనాల అన్వేషణ కొనసాగిస్తోంది. అయితే విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో సచివాలయం ఖరారు కాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది.
కీలక దశలో మూడు రాజధానుల ప్రక్రియ
ఏపీలో మూడు రాజధానుల ద్వారా పాలనా వికేంద్రీకరణ చేపట్టాలన్న వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అసెంబ్లీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులకు ఆమోదం లభించినా మండలిలో సెలక్ట్ కమిటీ వ్యవహారంతో బ్రేకులు పడ్డాయి. మండలి రద్దు కోసం కేంద్రానికి పంపిన అసెంబ్లీ తీర్మానం ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు రూపంలో మారి ఆమోదం పొందుతుందని ప్రభుత్వం గంపెడాశతో ఉంది. ఈ ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేసుకుంటే మే నెలలో అమరావతి నుంచి సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖకు తరలించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన.
విశాఖలో సచివాలయం ఎక్కడ ?
విశాఖను కార్యనిర్వహక రాజధానిగా అమల్లోకి తీసుకురావాలంటే ఎలాగో కొంత సమయం పడుతుంది. ఆలోగా విశాఖలో సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల కోసం అనువైన భవనాలను అన్వేషించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉంది. ఇప్పటికే సీఎంవోని పలువురు అధికారులతో పాటు రాజకీయ నేతలు, జగన్ సతీమణి భారతి సైతం విశాఖలో పలుమార్లు పర్యటించారు. సీఎం నివాసంతో పాటు సచివాలయం, ఇతర భవనాల కోసం మిలీనియం టవర్స్, మాజీ సీఎం రోశయ్య అల్లుడికి చెందిన విద్యాసంస్ధల భవనాలను ఇప్పటివరకూ పరిశీలించినా ప్రభుత్వం తుది నిర్ణయానికి రాలేకపోయింది.
కాపులుప్పాడలో శాశ్వత సచివాలయం
విశాఖ నగర శివార్లలో ఉన్న కాపులుప్పాడ కొండపై శాశ్వత సచివాలయం నిర్మించేందుకు పరిస్ధితులు అనువుగా ఉన్నాయని సీఎం జగన కు అధికారులు నివేదించారు. అయితే ఇక్కడ శాశ్వత సచివాలయం నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. ఆ లోగా తాత్కాలిక భవనాల్లో సచివాలయం ఏర్పాటు తప్పదు. దీంతో తాత్కాలిక భవనాల అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజధాని నేపథ్యంలో విశాఖలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రభుత్వం స్ధలాలు, భవనాలు సేకరించడం కష్టసాధ్యంగా మారింది. అయితే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి.
ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
అన్నీ సక్రమంగా ఉంటేనే హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధం కాలేదు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్, అమరావతి నుంచి ఏకంగా విశాఖకు వెళ్లాలంటే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సచివాలయం ఎక్కడ ఉంటుందో ఇంకా ఖరారు కాకపోవడంతో ఇళ్లు తీసుకోవాలన్నా, పిల్లలకు విద్యాసంస్ధలు అందుబాటులో ఉండాలన్నా వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. కేంద్రీయ విద్యాసంస్ధలతో పాటు స్ధానిక స్కూళ్లలోనూ అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో ప్రభుత్వం తమను ఎప్పుడు పంపుతుందో తెలియక, పిల్లల చదువులకు ఏర్పాట్లు చేసుకోలేక ఉద్యోగులు నలిగిపోవాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. ప్రభుత్వం మాత్రం ఓసారి భవనాలు సిద్ధం కాగానే వెనువెంటనే సమాచారం ఇవ్వడంతో పాటు ఉద్యోగుల కుటుంబాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తోంది. అయినా ఉద్యోగుల్లో ఆందోళన తప్పడం లేదు.