ప్రత్యేక హోదా కోసం...ఎపి ఉద్యోగ సంఘాల జెఎసి ఆందోళన
అమరావతి:ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఎపి ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో, విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద నగరపాలక సంస్థ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఎపి ఉద్యోగ సంఘాల జెఎసి అమరావతి విభాగం అధ్యక్షుడు బొప్పరాజు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపును అనుసరించి పని వేళల్లో కాకుండా భోజన విరామం సమయంలో బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాలు ఈ ఆందోళన చేపట్టారు. అయితే తాము గత నెల 28వ తేదీ నుంచే పలు ప్రభుత్వ కార్యాలయల వద్ద నల్లబ్యాడ్జీలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసనలను తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా జెఎసి ఛైర్మన్ బొప్పరాజు చెప్పారు.
విభజన హామీల అమలు ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్థులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో మరోసారి జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి ఒక మెట్టు కిందకు దిగైనా గతంలో హాజరు కాని వివిధ రాజకీయపార్టీలను ఈ సమావేశానికి హాజరయ్యే విధంగా గట్టి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 6వతేదీ నుంచి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు బొప్పరాజు తెలిపారు. తమతో పాటు ప్రభుత్వంలోని వివిధ ముఖ్య శాఖల ఉద్యోగ సంఘాలు కూడ ఉద్యమబాట పట్టాలని కోరారు. కేంద్రం విభజన హామీలు అమలు చేసేంతవరకు తమ ఆందోళన ఆగదని ఎపి ఉద్యోగ సంఘాల జెఎసి అమరావతి విభాగం అధ్యక్షుడు బొప్పరాజు స్పష్టం చేశారు.