అటు కరోనా- ఇటు జగన్- విశాఖ తరలింపుపై ఏపీ ఉద్యోగుల్లో ఆందోళన...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగానే రాజదాని తరలింపు కోసం ప్రభుత్వం సిద్ధమవుతుందన్న అంచనాల మధ్య ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ భయాలతో ఇంటి వద్దనే ఉండి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు రాజధాని తరలింపు పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో వారిలో అనుమానాలు నెలకొన్నాయి. వీటిని ప్రభుత్వం నివృత్తి చేయకపోతే అవి మరింత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది.
రాజధాని తరలింపు ఆశలు..
ఏపీలో రాజధాని తరలిపు అంశంపై కరోనా ముందు వరకూ సజీవంగా ఉంచిన ప్రభుత్వం తాజాగా కొంతకాలంగా మాట్లాడటం మానేసింది. అధికారులు, మంత్రులు, సాధారణ ఉద్యోగుల్లో సైతం దీని గురించిన ప్రస్తావన లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఏ క్షణాన్నైనా రాజధాని తరలింపుకు సిద్దం కావచ్చన్న ప్రచారం మాత్రం వెలగపూడి సచివాలయంలో కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం సీఎం జగన్. ఆయన ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియదని, అన్నింటికీ సిద్దంగా ఉంటేనే మంచిదన్న భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తోంది.
దగ్గర పడుతున్న సమయం..
ఏపీలో ప్రస్తుతం కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. వివిద జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గలేదు. మే 3వ తేదీ వరకూ కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ అధికారికంగా అమల్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్దితుల్లో రాజధాని తరలింపు ఉంటుందా లేక వాయిదా పడుతుందా అంటే ఏదీ కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో ఇప్పుడు కొత్త రాజధానికి తరలి వచ్చేందుకు సిద్ధమైన ఉద్యోగుల్లోనూ అయోమయ పరిస్ధితి కొనసాగుతోంది.
వస్తే ఓ సమస్య.. రాకపోతే మరొకటి..
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ మే 3 వరకూ అమల్లో ఉంటుంది. అయినా ఉద్యోగులను కరోనా విధుల పేరుతో రాష్ట్రమంతా ఎలాగో తిప్పుతున్నారు. కాబట్టి కొందరు ఉద్యోగులను అయినా మే నెలలో ఆన్ డ్యూటీ పేరుతో విశాఖ తరలించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా అనధికారికంగా మాత్రం విస్తృత చర్చ సాగుతోంది. ప్రభుత్వం దానికే సిద్ధమైతే ఉద్యోగులు తప్పనిసరిగా విశాఖకు సర్దుకోవాల్సి ఉంటుంది. అంటే కరోనా ప్రభావం కొనసాగుతున్నా ప్రభుత్వం కోరుకుంటే విశాఖ వెళ్లక తప్పదు. ఇప్పుడు ఈ అంశమే ఉద్యోగుల్లో కలవరం రేపుతోంది. దీంతో అటు జగన్ ను కాదనలేక ఇటు కరోనాను ఆహ్వానించలేక ఉద్యోగులు నలిగిపోతున్నారు.