సచివాలయ సందడి: ఏపీ నుంచి పాలన, ఎమ్మెల్యేలకు తాత్కాలిక వసతి
అమరావతి: వెలగపూడిలో నిర్మితమవుతున్న అసెంబ్లీ, శాసన మండలి భవనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేస్తామని, శీతాకాల సమావేశాలు ఇక్కడే ఉంటాయని, సభా సమయంలో సభ్యులకు తాత్కాలిక వసతి కల్పిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద రావు, మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం తెలిపారు.
తాత్కాలిక సచివాలయాన్ని యనమల, కోడెలలు పరిశీలించారు. అనంతరం యనమల మాట్లాడారు. డిసెంబర్ 15 నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తామన్నారు.
హైదరాబాదులోని ఏపీ భవనాలు మన ఆదీనంలోనే ఉంటాయని యనమల చెప్పారు. దీని పైన కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
స్పీకర్ కోడెల శివప్రసాద రావు మీడియాతో మాట్లాడారు. సభ సమయంలో సభ్యులకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తామన్నారు. శీతాకాల సమావేశాలు ఏపీలోనే జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, చీప్ విప్లకు కార్యాలయాలు కేటాయిస్తామన్నారు. సభ్యులు క్రమశిక్షణ తప్పితే చర్యలు ఉంటాయన్నారు.
విభజన తర్వాత తలెత్తిన ఇబ్బందులను అధిగమించి సచివాలయ పనులు పూర్తి చేసుకోగలిగామన్నారు. ప్రాథమిక స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నా అధిగమించామన్నారు. పెషీలు, సిబ్బంది కార్యాలయాలు, కమిటీ హాళ్లు ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సచివాలయంలో సందడి
ఏపీ సచివాలయంలో మంచి వాతావరణం ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీ కృష్ణ తెలిపారు. మహిళా ఉద్యోగులకు ఇక్కడే వసతి కల్పించాలన్నారు. ఇక్కడ పని చేసేందుకు ఉద్యోగులు ఉత్సాహం చూపుతున్నారన్నారు. సచివాలయాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేశారని, వెలగపూడి నుంచి ఇక పాలన ప్రారంభమైనట్లేనని రెవెన్యూ ఊద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు.