ఏపీలో ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు- ప్రభుత్వ తీరుపై వేతన జీవుల్లో ఆగ్రహం..
ఏపీలో జూన్ నెల జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆరో తేదీ వచ్చేసినా ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో ఇంకా జీతాలు తమ కాలేదు. ప్రభుత్వ ఆమోదం లభించినా ఇంకా గ్రీన్ ఛానల్లో జీతాల బిల్లులకు క్లియరెన్స్ రాకపోవడంతో ఇవాళ కూడా ఉద్యోగులకు నిరాశ తప్పలేదు. రేపు ఎట్టిపరిస్ధితుల్లోనూ జీతాలు జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ద్రవ్య బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడంతో ఉద్యోగుల జీతాలు నానాటికీ ఆలస్యమవుతున్నాయి.
గత నెలలో అసెంబ్లీ ఆమోదించిన ద్రవ్యవినిమయ బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరించి కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టకుండానే సభ నిరవధికంగా వాయిదా వేసుకుని వెళ్లిపోయాయి. ద్రవ్యబిల్లు ఆమోదం పొందకపోవడానికి వైసీపీయే కారణమని టీడీపీ.. కాదు టీడీపీయే కారణమని వైసీపీ ఆ తర్వాత పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
అయితే ఇంత కీలకమైన బిల్లు విషయంలో ఇరుపక్షాల వైఖరి కారణంగా ద్రవ్యబిల్లు ఆమోదం పొందకుండా పోయింది. చివరికి రెండు వారాల వ్యవధి తర్వాత జూలై మొదటివారంలో గవర్నర్ దాన్ని ఆమోదించారు. మిగిలిన సాంకేతిక సమస్యలు కూడా దాటుకుని నిన్నటికే జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో పడాల్సి ఉండగా.. పలు కారణాలతో ఇవాళ కూడా రాలేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.