రూపాయికే జ్యోతిష్యం పేరుతో అనుచరుల లైంగిక వేధింపులు: మంత్రి వెల్లంపల్లిపై జగన్ సీరియస్
ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడ భవానీపురంలో జ్యోతిషాలయం నడుపుతున్న ఆయన అనుచరులు వంశీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిపై తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. జ్యోతిష్యం ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు నగరంలో పలు చోట్ల కబ్జాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం కాస్తా సీఎం జగన్ వద్దకు వెళ్లింది..
రూపాయికే జోస్యం - వేధింపులు
కేవలం రూపాయి తీసుకుని జోస్యం చెప్పడం మొదలెట్టి...'తాంత్రిక మంత్రాలు' అంటూ కబుర్లన్నీ చెప్పి ఏకంగా ఓ డెబ్బై కోట్లు వెనుకేశాడో వైసీపీ నేత. విజయవాడలో నివాసం. 'ఆంధ్రా, తెలంగాణ' అనే బేధం లేకుండా ఎంచక్కా మోసాలు. బెజవాడ భవానీపురంలో జ్యోతిషాలయం నిర్వహిస్తున్న అతని పేరు కోనాల అచ్చిరెడ్డి. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడు. అచ్చిరెడ్డి కుమారుడు వంశీకృష్ణారెడ్డి వెల్లంపల్లికి రైట్ హ్యాండ్ కూడా. తాజాగా వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శిగా మంత్రి గారు ఆయనకు పదవి కూడా ఇచ్చారు.
తండ్రీకొడుకులిద్దరూ కలిసి మహిళలను లైంగికంగా వేధించడం అలవాటుగా మార్చుకున్నారు. జాతకాల పేరుతో లక్షలాది రూపాయలు దండుకోవడానికే దుకాణం పెట్టుకున్నారు. ప్రజల బలహీనతలే పునాదులుగా చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించారు. నమ్మి వచ్చే భక్తుల్ని దోచుకున్నారు. సాప్ట్ వేర్ కంపెనీలలో, షేర్లలో పెట్టుబడులు పెడతామంటూ లక్షల రూపాయలు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
మోసం, వేధింపులపై తెలంగాణలో కేసు
తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిస్తానంటూ రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శి కోనాల వంశీ కృష్ణారెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు.
వంశీ అధికార పార్టీ నాయకుడిగా ఉండటం, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు అనుచరుడిగా ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఆంధ్రా పోలీసులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తండ్రీ కొడుకులపై కేసు నమోదు చేయడంతో పలువురు బాధితులు ఏపీ పోలీసులపైనా ఒత్తిడి తెస్తున్నారు.
అసలేం జరిగింది?
గతేడాది తెలంగాణకు చెందిన ఓ మహిళ జ్యోతిషం చెప్పించుకునేందుకు భవానీపురంలోని జ్యోతిషాలయంకు వచ్చి వైసీపీ నేత కోనాల అచ్చిరెడ్డిని కలిసింది. ఆ సమయంలో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు తనతో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిస్తానని రూ.50 లక్షలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా వీరిద్దరూ కలిసి ఆమెను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించింది. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు బెజవాడ పోలీసులను ఆశ్రయిస్తే వారు రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.
పోలీసుల నిర్లక్ష్యం- పెరిగిన వేధింపులు
దీంతో మంత్రి వెల్లంపల్లి అండ చూసుకొని వంశీ కృష్ణారెడ్డి ఆ మహిళను బెదిరించడం ప్రారంభించాడు. తన వద్ద ఆమె నగ్న చిత్రాలు ఉన్నాయని బెదిరించడంతో బాధిత మహిళ ఏం చేయాలో పాలుపోక కొద్దిరోజుల క్రితం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ లో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు వంశీ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లైంగిక వేధింపులు, నగ్న ఫోటోలున్నాయని బెదిరించడం, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఆమె కారును కూడా లాక్కున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తండ్రీకొడుకుల దందాల పర్వం
విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని పాత ఎంఐజీ 123 బ్లాకులో జ్యోతిషాలయం నిర్వహించే అచ్చిరెడ్డి అదే బ్లాకులో ఉన్న ఆనం మోహన్ రెడ్డి, చెంచులక్ష్మి దంపతుల ఫ్లాటును కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఫ్లాటును మోహన్రెడ్డి రిటైర్డ్ వీఆర్వో ప్రకాశరావు నుంచి కొన్నారు. అచ్చిరెడ్డి బెదిరింపులకు భయపడే ప్రకాశరావు తన ఫ్లాటును మోహన్ రెడ్డికి అమ్ముకుని వెళ్లిపోయారు.
మోహన్ రెడ్డి కొన్నాక ఆయనకూ అచ్చిరెడ్డి నుంచి వేధింపులు తప్పలేదు. రూ.30 లక్షల విలువ చేసే ఫ్లాటును రూ.10 లక్షలకు తనకు విక్రయించాలని అచ్చిరెడ్డి వేధించడం మొదలు పెట్టాడు. 'మంత్రి అనుచరులు' అంటూ కొందరు ఫోన్లు చేసి మోహన్ రెడ్డి దంపతులను బెదిరించారు. దీనిపై ఈ దంపతులు గత ఏడాది ఆగస్టు 19న స్పందనలో పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు.
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుపేరు చెప్పి అచ్చిరెడ్డి, ఆయన కొడుకు వంశీ కృష్ణారెడ్డి విజయవాడ వన్టౌన్లో అరాచకాలకు పాల్పడుతున్నా మంత్రి చూసీ చూడనట్లు ఎందుకు వుంటున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీంతో తండ్రీ కొడుకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
మంత్రిపై సీఎం జగన్ సీరియస్
విజయవాడలో జ్యోతిష్యాలయం పేరుతో వెల్లంపల్లి అనుచరులైన వైసీపీ స్ధానిక నేతలు అచ్చిరెడ్డి, వంశీకృష్ణారెడ్డి వేధింపులకు పాల్పడిన వ్యవహారం సీఎం జగన్ వరకూ వెళ్లింది. దీంతో ఆయన అచ్చిరెడ్డి, వంశీకృష్ణారెడ్డి వ్యవహారంపై మంత్రి వెల్లంపల్లిని ఆరా తీశారు. అనుచరులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఎందుకు ఉపేక్షించారని మంత్రిపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వివరణ ఇచ్చుకోలేక మంత్రి ఇబ్బంది పడినట్లు సమాచారం.