సెలవులో ఎల్వీ సుబ్రమణ్యం.. కొత్త బాధ్యతలకు దూరం.. సీఎస్గా సహనీ వైపు జగన్ మొగ్గు..?
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్కు ఎల్వీ సుబ్రమణ్యం బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే తాను సెలవులో వెళుతున్నట్టు ప్రకటించారు. నెలరోజులపాటు సెలవు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తర్వాత కూడా ఆయన విధుల్లో చేరతారా ? లేదంటే సెలవు పొడిగించుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సెలవులో ఎల్వీ..
ఏపీ మాజీ సీఎ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఎల్వీని బదిలీ చేశారు. బాపట్లలోని హెచ్ఆర్డీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి అప్రధాన్య పోస్టుకు పంపడంపై ఎల్వీ కినుక వహించారు. అక్కడ విధులు నిర్వహించబోనని సంకేతాలు ఇచ్చారు. ఇంచార్జీ సీఎస్ బాధ్యతలు ప్రసాద్కు అప్పజెప్పి సెలవులో వెళ్లారు.
ఇంచార్జీ బాధ్యతలు
ప్రస్తుతం ఇంచార్జీ సీఎస్గా ప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ వేటలో ఏపీ ప్రభుత్వం నిమగ్నమైంది. నీలం సహానికే బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆమె నియామకం అనధికారికంగా ఖరారైంది. కానీ ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది. నీలం సహానీ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఆమె అక్కడినుంచి రిలీవ్ అవ్వాలి. వచ్చాకే ఏపీ సీఎస్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కానీ సహానిని రిలీవ్ చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. పంపిస్తే ఓకే.. చేయకుంటేనే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.
సహనీ కాదంటే శర్మ
ఒకవేళ సహానీని కేంద్రం రిలీవ్ చేయకుంటే మాధ్యేమార్గంగా సమీర్ శర్మకు బాధ్యతలు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సహానీకి సీఎస్ పగ్గాలు అప్పజెప్పుతామని.. ఆమెను కేంద్రం రిలీవ్ చేయకుంటే మాత్రం సమీర్ శర్మకు సీఎస్ పదవీ వరించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ను సహాని కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాలని కోరితే.. ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె కేంద్రం నుంచి రిలీవ్ కావడానికి మూడురోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రసాద్ ఇంచార్జీ సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తారు.
బదిలీ ఎందుకంటే
ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ రాజకీయంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం జగన్ ఆదేశాలనే బేఖాతరు చేసినట్టు తెలుస్తోంది. పోస్టింగులను కూడా పక్కన పెట్టారని సమాచారం. బిజినెస్ రూల్స్ సవరణ, వైఎస్ఆర్ లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుల నిర్ణయం సీఎస్ సమక్షంలోనే జరిగాయని ఏపీ సర్కార్ చెబుతోంది. దీనికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో కూడా పెట్టాలనే సీఎం ఆదేశాలను ఎల్వీ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. ఎల్వీపై బదిలీ వేటు వేశారు.