కేసీఆర్ సర్కారుకు ‘ఏపీ సమాఖ్య’ షాక్: తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు
అమరావతి: తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో షాక్ తగిలింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని నిలుపుదల చేయాలంటూ కేంద్ర నీటి పారుదల శాఖకు ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ రాసింది. ఏపీ రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.
సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలు, మిషన్ భగీరథ 20 టీఎంసీలు, భక్త రామదాసు 6 టీఎంసీలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని లేఖలో పేర్కొంది.
Recommended Video
ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర విస్తరణకు 105 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 250 టీఎంసీలతో ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్ కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 11.74 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ కింద కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న 3.97లక్షల ఎకరాలు కలిపి మొత్తం 15.71లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది
శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ లకు ఎగువన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపి చట్ట ప్రకారం దిగువ రాష్ట్రమైన ఏపీ రైతుల హక్కులను కాపాడాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు. ఇందుకు సంబంధించి కేఆర్ఎంబీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.