హైకోర్టు ఎక్కడో మంత్రి బుగ్గన తేల్చేసారు: మరి..ఆ ప్రాంతానికి ఏం చెబుతారు: అదే ఫైనలా..!
ఏపీలో కొద్ది రోజులుగా హైకోర్టు ఏర్పాటు మీద ఆందోళనలు సాగుతున్నాయి. అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత న్యాయ వాదులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత వాసులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వేంకటేష్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో విశాఖలో సైతం హైకోర్టు ఏర్పాటు మీద ఆందోళను మొదలయ్యాయి.
దీని మీద ఇప్పటి వరకూ ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. ఇప్పుడు ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలానికి కారణమయ్యాచి. సీమలోనే హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో..మరి అమరావతితో పాటుగా ఉత్తరాంధ్ర వాసులను ప్రభుత్వం ఏ విధంగా సమాధాన పరుస్తుందనేది చర్చ నీయాంశంగా మారింది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ సర్కార్ పై మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఫైర్ .. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రాలు
సీమలోనే హైకోర్టు మంత్రి వ్యాఖ్యలతో...
ఏపీ హైకోర్టు ప్రస్తుతం అమరావతిలోని తాత్కాలిక భవనంలో కొనసాగుతోంది. అయితే.. కొద్ది రోజులుగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటికి పోటీగా గుంటూరులో ఇక్కడే హైకోర్టు కొనసాగించాలని న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. తాజాగా విశాఖలో తమ వద్ద హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ మొదలైంది. ఈ సమయంలో ఆర్దిక మంత్రి బుగ్గన రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బుగ్గన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. అమరావతి నుండి హైకోర్టును జగన్ ప్రభుత్వం రాయలసీమ కు తరలించే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు కొద్ది రోజులుగా ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో..దీనికి వ్యతిరేకంగా రాజధాని తో పాటుగా విశాఖలోనూ ఆందోళన మొదలైంది. అయితే, బుగ్గన చేసిన వ్యాఖ్యల ద్వారా రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు అవుతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. తాజాగా మంత్రులను స్థానిక విద్యార్ధి సంఘాలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేసాయి.
చంద్రబాబు ప్రభుత్వం ఇదీ ప్రతిపాదన..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు చెందిన కొందరు నేతలు కలిసి తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్ద మనుషుల ఒప్పందం మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర హక్కుల పోరాట సమితి నేతలు సైతం ముఖ్యమంత్రికి తమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీని పైన నిర్ణయం జరగలేదు. పాలనా పరమైన వ్యవస్థలు మొత్తం ఒకే చోట ఏర్పాటు చేస్తే హైదరాబాద్ తరహాలో ఒకే చోట డెవలప్ మెంట్ కనిపిస్తుందని..దీని ద్వారా మిగిలిన ప్రాంతాల్లో నైరాశ్యం ఏర్పడుతుందని అప్పట్లోనే శివరామక్రిష్ణ కమిటీ హెచ్చరించింది.
జగన్ ఆలోచన ఏంటంటే..
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో భవిష్యత్ లో ప్రాంతీయ ఉద్యమాలు రాకూడదని..దీనికి గాను పరిపాలన వికేంద్రీకరణ అవసరమని అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే..ప్రత్యేకంగా హైకోర్టు విషయంలో ప్రస్తుతం ఉన్న అమరావతిలోనే కొనసాగిస్తూ కర్నూలు..విశాఖల్లో బెంచ్ లు ఏర్పాటు చేయటం ఒక ప్రతిపాదన. అదే విధంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేసి విశాఖ తో పాటుగా అమరావతిలో బెంచ్ ఏర్పాటు చేయాలనేది మరో ప్రతిపాదన. ఒక చోటకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరో చోట వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు జగన్ హైకోర్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.